వేలు కొరికింది: 32 సార్లు పొడిచి భార్యను చంపాడు
ముంబై: ఇటీవల ముంబైలోని అంధే్రీలో జరిగిన మహిళ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళను భర్తనే చంపి, పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించి, వాషీ వంతెనపై నుంచి దూకేశాడు. ఇద్దరు గొడవ పడిన సమయంలో భార్య భర్త వేలిని కొరికిందని, దాంతో అతను కత్తితో ఆమెను 32 సార్లు పొడిచి చంపాడని అంటున్నారు. ఈ విషయాన్ని మిడ్డే రాసింది.
రాజేష్ నారాయణ్ (27) అనే వ్యక్తి తన భార్య రీతు (22)ను జూన్ 9వ తేదీన హత్య చేశాడు. తనకు విడాకులు ఇవ్వాలని, తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని రీతూ భర్త రాజేష్ నారాయణ్తో గొడవ పడింది. వీరిద్దిరికి నిరుడు వివాహమైంది. ఖజుర్వాడీలో నివసిస్తూ ఇద్దరు కూడా వేర్వేరు కాల్ సెంటర్లలో పనిచేస్తూ వస్తున్నారు.
మిడ్డే కథనం ప్రకారం - జూన్ 9వ తేదీన రీతు భర్తను పిలిచి వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుందామని చెప్పింది. ఆఫీసులో ఉన్న నారాయణ్ వెంటనే ఇంటికి వచ్చాడు. తాను విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నట్లు చెప్పడంతో రీతూను అతను దుర్భాషలాడాడు. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.
ఆ స్థితిలో అతను ఆమె నోట్లో దుప్పట్టాను దూర్చడానికి ప్రయత్నించాడు. ఆమె అతని వేలిని కొరికింది. దాంతో అతనికి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో రీతూను విచక్షణారహితంగా 32 సార్లు పొడిచాడు. ఆమెను బాత్రూంలో పెట్టి అతను 7 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. ఆ తర్వాత వాషి వంతెనపైకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు.
తాను భార్యను హత్య చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు చెప్పాడు. అయితే, రాజేష్ను జాలర్లు రక్షించారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు.