అనుమానం: భార్యను చంపి, కత్తితో ఠాణాకు వచ్చాడు
చెన్నై: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి, ఆ తర్వాత తాడుతో ఉరేశాడు. ఈ సంఘటన చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తనిలో సోమవారం ఉదయం జరిగింది.
తన భార్య నిర్మల (23)ను చంపిన తర్వాత జి మోహన్ (26) అనే వ్యక్తి తిరుత్తని పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. భార్యను చంపడానికి వాడిన కత్తితో, రక్తం అంటిన దుస్తులతో అతను పోలీసు స్టేషన్కు వచ్చాడు. మోహన్ అనుమానిస్తుండడంతో భరించలేక నిర్మల గత మూడేళ్లుగా చెన్నైలోని చూలాయ్లో తల్లిదండ్రులతో నివసిస్తోంది.
తన భార్యను తనతో పంపించాలని మోహన్ కోర్టుకు ఎక్కాడు. దాంతో కోర్టు వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఎనిమిది నెలల క్రితం వారిద్దరు కలిసిపోయారు. మోహన్ తల్లి కూడా వారితో ఉంటోంది. మోహన్ తిరుత్తనిలోని గోనెసంచుల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వారిద్దరు గొడవ పడ్డారు. ఆ తర్వాత పడుకున్నారు.
మోహన్ తెల్లవారు జామునే లేచి భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. ఆమె ప్రాణాలతో విలవిలలాడుతుండగా తాడు తీసుకుని గొంతు నొక్కాడు. ఈ హత్య సోమవారం తెల్లవారు జామున గం.5.45 నిమిషాల ప్రాంతంలో జరిగింది.
వారికి దివ్య (5), సుభాష్ (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలూ మోహన్ తల్లీ మరో గదిలో పడుకున్నారు. నిర్మల కేకలకు వారు లేచారు. వారు చూసేసరికే ఆమె మరణించింది. నిర్మల మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరుత్తనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు.