అలా చేస్తే గుప్త నిధుల దొరుకుతాయన్న స్వామీజీ.. పెళ్లైన మొదటి రోజు నుంచే భర్త ఏం చేశాడంటే..
చంద్రపూర్ : రాకెట్ యుగంలోనూ జనం రాతి యుగం నాటి మూడ నమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. దొంగబాబాల మాటలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొత్త పెళ్లి కూతురుతో తాను చెప్పినట్లు పూజలు చేయిస్తే గుప్త నిధులు దొరుకుతాయన్న ఆ దొంగ బాబా మాటలు నమ్మిన కుటుంబసభ్యులు నవ వధువుకు నరకం చూపారు. 50 రోజుల పాటు చిత్ర హింసలు అనుభవించిన సదరు యువతి ఎట్టకేలకూ విముక్తి లభించడంతో ఊపిరిపీల్చుకుంది.
భార్యను చంపాను దయచేసి వచ్చి అరెస్ట్ చేయండి...!
పెళ్లైన మొదటి రోజు నుంచే
చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలుకాలోని షిగావ్ గ్రామానికి చెందిన యువతికి 2018 ఆగస్టులో పెళ్లైంది. కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు మొదటి రోజే ఆ ఆశలు అడియాశలయ్యాయి. ఓ స్వామీజీని గుడ్డిగా నమ్మే భర్త, అత్తామామలు అతని మాటలు విని కొత్త పెళ్లి కూతురికి నరకం చూయించారు. కొత్త కోడలితో పూజలు చేయిస్తే గుప్త నిధులు దొరుకుతాయని ఆ దొంగబాబా చెప్పడంతో భర్త, అత్తమామలు ఆమెను అలా చేయమని వేధించేవారు.
మానసిక, శారీరక హింస
భర్త అత్తమామలు కొత్త కోడలికి పూజల పేరుతో మానసికంగా, శారీరకంగా హింసించేవారు. తెల్లవారు జామున రెండున్నరకు నిద్రలేచి సూర్యుడు ఉదయించే వరకు పూజ కొనసాగించాలని చెప్పేవారు. నిత్యం ఉపవాసం పేరుతో కడుపుమాడ్చే వారు. ఏ రోజైనా తాను పూజ చేసేందుకు నిరాకరిస్తే భర్త, అత్తమామలు కొట్టి వేధించేవారు. నెలల తరబడి ఈ నరకం కొనసాగింది. ఫోన్ సైతం లాక్కోవడంతో ఆమె విషయం తల్లిదండ్రులకు చెప్పే వీలు లేకుండా పోయింది.
తండ్రికి అనుమానం వచ్చి
కూతురు నుంచి ఫోన్ రాకపోవడంతో యువతి తండ్రిలో అనుమానం మొదలైంది. దీంతో ఒకరోజు వారి ఇంటికి వెళ్లాడు. తిండిలేక చిక్కి శల్యమైన కూతురి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. కూతురిని వెంట బెట్టుకుని ఇంటికెళ్లిన ఆయన అసలు విషయం అడిగి తెలుసుకున్నాడు. దారుణంగా వ్యవహరించిన భర్త, అత్తమామలతో పాటు దొంగ బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు.