జయలలిత-శోభన్బాబుల కొడుకునంటున్న వ్యక్తి అరెస్ట్
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి.. కోర్టు ఆగ్రహానికి గురైన వ్యక్తిని చెన్నై సిటీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తానే జయలలిత కుమారుడినంటూ తప్పుడు పత్రాలు
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి.. కోర్టు ఆగ్రహానికి గురైన వ్యక్తిని చెన్నై సిటీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తానే జయలలిత కుమారుడినంటూ తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించిన జే కృష్ణమూర్తి(28) అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. దిండిగల్ బస్ స్టేషన్లో చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి అతడ్ని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి.. శనివారం చెన్నైకి తీసుకొచ్చారు. హైకోర్టు ఆదేశాల తర్వాత తాను కొన్ని రోజులపాటు ఇద్దరు లాయర్ల ఇళ్లలో తలదాచుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తమిళనాడు ఆర్టీసీ బస్సులలో రాష్ట్రమంతా తిరిగినట్లు పోలీసులకు కృష్ణమూర్తి తెలిపాడు.
తాను జయలలిత, దివంగత నటుడు శోభన్ బాబులకు జన్మించానని, ఆమె ఆస్తులకు తానే వారసుడినని ఈరోడ్కు చెందిన ఇతడు.. గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతోపాటు జయలలిత ఆస్తులన్నంటినీ తనకు అప్పగించాలని కృష్ణమూర్తి కోరాడు.
1985లో తాను జయలలితకు జన్మించానని, ఆ మరుసటి సంవత్సరం తనను ఆరోడ్ కు చెందిన వసంతమణికి దత్తత ఇచ్చారని కృష్ణమూర్తి తెలిపాడు. దత్తత పత్రంపై జయలలిత, శోభాన్ బాబు, వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సాక్షిగా సంతకం చేశారని తెలిపాడు.
కాగా, అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణలో అతడు సమర్పించినవి తప్పుడు పత్రాలని తేలడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడ్ని అరెస్ట్ చేయాలని మార్చి 27న ఆదేశించింది.