'ఫతా 4' మిసైల్ సక్సెస్.. భారత్ కు సవాల్ విసిరిన పాకిస్థాన్..!
పాకిస్థాన్ రక్షణ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఫతా-4 అనే గ్రౌండ్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ ను పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్.. దీనిని క్రూయిజ్ మిసైల్ తరహాలో ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి పరిధి 750 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ఇది గతంలో ఉన్న ఫతా వెర్షన్స్ కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది.
ఇందులో అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ అలాగే ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దీనివల్ల శత్రువుల కదలికలను, సామర్థ్యాలను అత్యంత కచ్చితత్వంతో దెబ్బదీయగలదు. దీనిని మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా వేగంగా ప్రయోగించవచ్చు. దీనివల్ల యుద్ధ సమయంలో శత్రువుల రాడార్లకు దొరక్కుండా వేగంగా కదలడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఫతా-4 మిసైల్ లో ఆధునిక ఏవియానిక్స్, విమాన నియంత్రణ వ్యవస్థలను అమర్చారు. ఇది గాలిలో ప్రయాణించేటప్పుడు తన మార్గాన్ని సరి చూసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక ఈ ఫతా 4 మిసైల్ పరీక్షను పాకిస్థాన్ సైన్యానికి చెందిన రాకెట్ ఫోర్స్ కమాండ్ నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని పాకిస్థాన్ లోని సైనిక ఉన్నతాధికారులతోపాటుగా క్షిపణి అభివృద్ధి సంస్థకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు, నిపుణుల ఆధ్వర్యంలో జరిగింది.

ఇక ఫతా 4 మిసైల్ పరీక్ష విజయవంతంపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ హర్షం వ్యక్తం చేస్తూ బృందాన్ని అభినందించారు. గతనెలలోనే ఫతా 2 మిసైల్ వ్యవస్థను కూడా విజయవంతంగా పరీక్షించింది పాకిస్థాన్. ఈ వరుస క్షిపణి పరీక్షలు పాకిస్థాన్ తన స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. 26 మంది టూరిస్టుల్ని కాల్చి చంపారు. అయితే అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది ఉగ్రవాదుల్ని హతమార్చింది.












Click it and Unblock the Notifications