రెండు వారాల్లో 7గురి హత్య: సీరియల్ కిల్లర్ అరెస్టు
సేలం జిల్లా పెద్దనాయకన్ పాళయం సమీపంలోని కత్తిరిపట్టి గ్రామానికి చెందిన 27 ఏళ్ల సుబ్బరాయన్ తమ్మంపట్టిలోని రాళ్లక్వారీలో లారీ క్లీనర్. ఆగస్టులో క్వారీకి సమీపంలో నివసిస్తున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, బండరాయితో మోది హత్యచేసి పరారయ్యాడు. ఈ కేసులో ఇతడి కోసం తమ్మంపట్టి పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఆ తరువాత ఈనెల 5న పెరియేరి గ్రామంలో ఓ కిరాణాకొట్టుపై దాడిచేసి, యజమాని సెల్వాన్ని కత్తితో నరికాడు. అరియలూరు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని గాలిస్తుండగా శనివారం రాత్రి దొరికాడు.
సుబ్బరాయన్ను ప్రశ్నించగా 15 రోజుల్లో 7 హత్యలు చేసినట్లు చెప్పాడు. అరియలూరు జిల్లా తలవాయ్ గ్రామానికి చెందిన రైతులు వేల్మురుగన్ (33), అతని భార్య పార్వతి(25), వారి కుమార్తె కీర్తన (2)లనూ హతమార్చినట్లు తెలిపాడు. అదే గ్రామంలోని ముత్తులక్ష్మి(75) అనే వృద్ధురాలిని, ఆమె కుమార్తె సావిత్రి (50), జయమేలు (82)లను కూడా హత్య చేసినట్లు అంగీకరించాడు.
ముగ్గురు బాధితురాళ్లపై అతను అత్యాచారం కూడా చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను అతను లక్ష్యం చేసుకునేవాడు. సుబ్బరాయన్ జీవితం అత్యంత దయనీయమైంది. సవతి తల్లి వేధింపులతో తన జీవితం అస్తవ్యస్తమైందని అతను చెప్పినట్లు సమాచారం. మూడు మార్లు పెళ్లి చేసుకున్న తండ్రి తనను పట్టించుకునేవాడు కాదని, సవతి తల్లి వేధింపులను నిరోధించలేకపోయాడని అతను చెప్పినట్లు తెలుస్తోంది.