మమత స్టైల్!: సీఎం అల్లుడి చెంపపై కొట్టినందుకు హత్యాయత్నంకేసు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ చెంప పైన కొట్టిన వ్యక్తి పైన హత్యాయత్నం కేసు పెట్టారు. అతనిని మంగళవారం నాడు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. అభిషేక్ను కొట్టిన వ్యక్తి పేరు దేబాషిష్ ఆచార్య.
అతనిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో హత్యాయత్నం సెక్షన్ కూడా ఉంది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి బాగుంటే న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.
అయితే, దేబాషిష్ ఆచార్య పైన హత్యాయత్నం కేసు పెట్టడాన్ని పలువురు ఖండిస్తున్నారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో పలు కామెంట్స్ వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీరు సిగ్గుపడేలా ఉందని, హత్యాయత్నం కేసు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కాగా, మమతా బెనర్జీ అల్లుడు, పార్టీ పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీపై చేయి చేసుకున్న బిటెక్ విద్యార్థిపై దాడి చేయడాన్ని తృణమూల్ కాంగ్రెసు సమర్థించుకున్న విషయం తెలిసిందే. బిటెక్ విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతనికి పలుచోట్ల గాయాలయ్యాయి. అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి 25 ఏళ్ల దేబాషిష్ ఆచార్య బీటెక్ విద్యార్థి. దుర్గాపుర్లోని ఇనిస్టిట్యూట్లో చదువుతున్నాడు.
ఆవేశంలో అప్పటికప్పుటి ప్రతిస్పందనగా యువకుడిపై దాడిని టిఎంసి సమర్థించుకుంది. దేవశీష్ ఆచార్యపై తృణమూల్ కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు చేతులతో, కర్రలతో, కుర్చీలతో దాడి చేశారు. తూర్పు మిడ్నాపూర్లోని ఆస్పత్రిలో అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఖండనార్హహమైన యువకుడి చర్యకు అతనిపై దాడి ఆవేశంలో చోటు చేసుకుందని టిఎంసి నాయకులు అన్నారు. పెద్ద నష్టమేమీ జరగలేదని, యువకుడు బతికే ఉన్నాడని, పెద్ద విషయమేమీ కాదని తృణమూల్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, పంచాయతీరాజ్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అన్నారు.
సంఘటన మీడియాలోని ఓ వర్గం చేసిన కుట్ర అని మరో మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. ఆ సంఘటనను ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన హింసతో సుబ్రతా ముఖర్జీ పోల్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చాలా మంది మరణించారని, ఆ విధమైనది ఏదీ ఇక్కడ జరగలేదని, యువకుడు బతికే ఉన్నాడని ఆయన అన్నారు.