ప్రధానిని చంపుతానని మెసేజ్: వ్యక్తి అరెస్ట్
మధుర: గత మే 25న మధురలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీలో బాంబులు పెట్టి చంపుతానని బెదిరింపులకు గురిచేస్తూ సందేశాలు పంపిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బెదిరింపులకు పాల్పడింది నౌజిహీల్ ప్రాంతంలోని నవేలి గ్రామానికి చెందిన రాంవీర్ అని పోలీసులు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ గత మేలో నగ్లచంద్రబన్లో నిర్వహించిన జన్ కళ్యాణ్ సభలో బాంబులు పెట్టి ప్రధానిని చంపుతానని రాంవీర్ బెదిరింపు సందేశాలు పంపినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్రకుమార్ సింగ్ తెలిపారు.
రాంవీర్కు మతిస్థిమితం సరిగా లేదని ఆయన చెప్పారు. దీంతో అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి, ఆ తర్వాత అతని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. అతడికి మద్యం, డ్రగ్స్ అలవాటు ఉందని చెప్పారు.
అతని ఫోన్ నుంచి ఎవరో ఈ బెదిరింపు సందేశాలను పంపివుంటారని అనుమానిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. మే 21న నిందితుడు బెదిరింపు సందేశం పంపినట్లు చెప్పారు. రాంవీర్ మానసికస్థితి సరిగా లేనందున, అతని సోదరుడు లక్ష్మణ్ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.