పెళ్లి పేరుతో ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్
మంగళూరు: బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను కర్ణాటకలోని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 16 సంవత్సరాల బాలికను పిలుచుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు చెప్పారు.
కుంజత్తబైల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రశాంత్ శెట్టి, సల్మాన్, అదిల్, సైఫల్, మరో గుర్తు తెలియని వ్యక్తి బాలిక మీద అత్యాచారం చేశారని మంగళవారం పోలీసులు చెప్పారు. నలుగురు నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారైనాడని పోలీసులు అన్నారు.
పోలీసుల కథనం మేరకు 16 సంవత్సరాల బాలిక, ప్రశాంత్ శెట్టి పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రశాంత్ శెట్టి ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు మొబైల్ లో బాలికతో మాట్లాడేవాడు.
తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేదింపులకు గురి చేశాడు. సోమవారం బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి పంజిగమూరు బస్ స్టాప్ దగ్గరకు పిలిపించాడు. అక్కడి నుంచి బైక్ లో ఆమెను పిలుచుకుని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లాడు.
అక్కడే ప్రశాంత్ శెట్టి అతని స్నేహితులతో కలిసి తన మీద గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. బాలికతో పాటు నిందితులను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసులు తెలిపారు.