మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం - త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా : బీజేపీ కొత్త వ్యూహంతో..!!
త్రిపురలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసారు. త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాణిక్ సాహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. అగర్తలలోని రాజ్భవన్లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది.

ఒక్క రోజులోనే కీలక మార్పులు
ఇందులో భాగంగా బిప్లవ్ కుమార్ దేవ్ శనివారం రాజీనామా చేశారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వృత్తి రీత్యా దంత వైద్యుడైన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్ను వదిలి భాజపాలో చేరారు. 2020 నుంచి భాజపా త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018 లో త్రిపురలో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది.

వచ్చే ఏడాది ఎన్నికలే టార్గెట్ గా
అయితే, క్రమేణా అక్కడ మమతా నాయకత్వంలోని టీఎంసీ బల పడుతోంది. బీజేపీకి పోటీగా నిలిచింది. రాష్ట్రంలో బిప్లవ్ కుమార్ దేవ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత.. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో హైకమాండ్ అప్రమత్తం అయింది. అక్కడ నాయకత్వ మార్పు అవసరమని గుర్తించింది. వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చక్రం తిప్పారు. ఆయన సూచనలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు శనివారం తన రాజీనామా లేఖను అందించారు.

పార్టీ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలతో
త్రిపురలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ వెంటనే త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మానిక్ సాహాను ఎంపిక చేసింది భాజపా అధిష్ఠానం. పార్టీ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. తాను పార్టీ ఆదేశాలున పాటిస్తానని.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించానని చెప్పుకొచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తాను పని చేస్తానని బిప్లవ్ కుమార్ దేవ్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications