ముఖ్యమంత్రికి సోకిన కరోనా: హోమ్ ఐసొలేషన్లో: త్వరగా కోలుకోవాలని కోరుకున్న కిషన్ రెడ్డి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ ఘటన మణిపూర్లో కలకలానికి దారి తీసింది. దీపావళి పండుగ సందర్భంగా శనివారం ఆయనను పలువురు అధికారులు కలిశారు. శుభాకాంక్షలను తెలిపారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతల, కార్యకర్తలు ఆయనతో భేటీ అయ్యారు. ఇక వారందరూ కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. తాను కరోనా వైరస్ బారిన పడినట్లు బీరేన్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించిన అశ్రద్ధ చేయొద్దని, సెల్ఫ్ ఐసొలేషన్లో ఉండాలని సూచించారు.
Get well soon @NBirenSingh ji, Prayers for your speedy recovery.
— G Kishan Reddy (@kishanreddybjp) November 15, 2020
తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే తాను కోలుకుని మళ్లీ విధులకు హాజరవుతానని చెప్పారు. ఇదివరకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వైరస్ బారిన పడి కోలుకున్నారు. కర్ణాటక, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రులు అశ్వర్థ నారాయణ, మనీష్ సిసోడియా కరోనా వైరస్ బారిన పడ్డవారే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం వైరస్ బాధితుడే.
Recommended Video
తాజాగా అదే జాబితాలో మణిపూర్ ముఖ్యమంత్రి కూడా చేరారు. బీరేన్ సింగ్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి అకాంక్షంచారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇంతకుముందు మణిపూర్ విద్యుత్ శాఖ మంత్రి థొంగమ్ బిశ్వజిత్, ఎమ్మెల్యే ఫజూర్ రెహ్మాన్ కరోనా పాజిటివ్గా తేలారు. మణిపూర్లో ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడి 218 మంది మరణించారు. 21,636 పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. వారిలో 18,334 మంది రికవరీ అయ్యారు.