విజయం సాధించిన మణిపూర్ సీఎం, ఉక్కుమహిళ తొలి ప్రయత్నం విఫలం
మణిపూర్ లోని తౌబల్ నియోజకవర్గంలో సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ పై పోటీకి దిగిన ఉక్కు మహిళ తన తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యారు.
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఓడిపోయారు. తౌబల్ నియోజకవర్గంలో ఆమె సీఎం ఒక్రమ్ ఇబోబి సింగ్ పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. మధ్యలో కాస్త ఆధిక్యంలోకి దూసుకెళ్లినా చివరికి షర్మిలకు ఓటమి తప్పలేదు. ఆమెకు కేవలం 51 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
సీఎం ఇబోబి సింగ్ గెలవడం ఇది నాలుగోసారి. పదిహేనేళ్లుగా ఇక్కడ ఆయనే అధికారం చెలాయిస్తున్నారు. తన అధికారం నిలుపుకునేందుకు సీఎం అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని ఇరోమ్ షర్మిల ఆరోపించారు. చివరికి ఆమె అన్నట్లుగానే జరిగింది.
మణిపూర్ లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష సాగించిన ఇరోమ్ షర్మిల ఉక్కు మహిళగా పేరుతెచ్చుకున్నారు. గత ఏడాది దీక్ష విరమించిన ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తన మద్దతుదారులతో కలిసి పీపుల్స్ రిసర్జన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించిన షర్మిల ఈసారి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. సామాజిక మార్పు తమ లక్ష్యం అని ప్రకటించిన ఆమె ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరారు.
తౌబాల్ నియోజకవర్గంలో ఏకంగా ముఖ్యమంత్రిపైనే షర్మిల పోటీకి దిగారు. సీఎం ఇబోబి సింగ్ తన అధికారం నిలుపుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని ఆమె ఆరోపించారు. చివరికి ఆమె అన్నట్లుగానే జరిగింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. తమ పార్టీ 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగుతుందని షర్మిల స్పష్టం చేశారు.