Manipur elections: బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వమే మణిపూర్ అభివృద్ధికి పునాది వేసింది: ప్రధాని మోడీ
బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషి రాబోయే 25 ఏళ్లలో మణిపూర్ అభివృద్ధికి పునాది వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. మణిపూర్లోని హీంగాంగ్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని, రాష్ట్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలలో, బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మణిపూర్ యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేసిందని మోడీ పేర్కొన్నారు. మీరు బిజెపి యొక్క మంచి పరిపాలనను, మంచి ఉద్దేశాలను చూశారు. గత 5 సంవత్సరాలలో మేము చేసిన పని రాబోయే 25 సంవత్సరాలకు పునాది వేసిందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో అసమానతలు మాత్రమే ఉన్నాయన్న పీఎం మోడీ
కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని, మణిపూర్లో దశాబ్దాల కాంగ్రెస్ పాలన తర్వాత, రాష్ట్రంలో అసమానతలు మాత్రమే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్ ఏవిధంగా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. గత నెలలో మణిపూర్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యాయి. గత కొన్ని దశాబ్దాల్లో రాష్ట్రం అనేక ప్రభుత్వాలను చూసింది. దశాబ్దాల కాంగ్రెస్ పాలన తర్వాత మణిపూర్లో ఆర్థిక అసమానతలు మాత్రమే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది: పీఎం మోడీ
బీజేపీ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, మణిపూర్లోని ప్రతి ప్రాంతం బంద్లు, దిగ్బంధనాల నుండి ఉపశమనం పొందిందని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ బంద్లు, దిగ్బంధనాలను మణిపూర్లో ప్రధాన లక్షణంగా మార్చుకుందని ఆరోపించారు. యువత ఆయుధాలు విడిచిపెట్టి, అభివృద్ధి ఉప్పెనకు నాయకత్వం వహించడం కోసం ముందుకు వస్తున్నారని, తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని యువతకు, తొలిసారిగా ఓటర్లకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

మణిపూర్లో మార్పు యొక్క కొత్త అధ్యాయాన్ని లిఖించింది బీజేపీ
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వంలో మీ చురుకైన భాగస్వామ్యమే మీ ఓటు అని తెలిపారు. ఓటు ద్వారా సరైన వారిని ఎన్నుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మీరు నిర్ణయం తీసుకోవడంలో భాగం అవుతారు అని మోడీ పేర్కొన్నారు. మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ చేసిన పనిని ప్రశంసించిన ప్రధాని మోదీ, తమ ప్రభుత్వం మణిపూర్లో మార్పు యొక్క కొత్త అధ్యాయాన్ని లిఖించిందని, అందరినీ ముందుకు తీసుకువెళ్లిందని అన్నారు.

కరోనా సమయంలో బీజేపీ రాష్ట్రాన్ని బాగా చూసుకుంది
కోవిడ్ సమయంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగా చూసుకుందని ఆయన అన్నారు. మణిపూర్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందించబడుతోందని పేర్కొన్నారు. ఇలాంటి మహమ్మారి 2017 కంటే ముందే వచ్చి ఉంటే, ఏమి జరిగి ఉండేది?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలను పట్టించుకోలేదు అన్న ఉద్దేశాన్ని ఆయన తన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. మణిపురిలో 10 మందిలో ప్రతి 7 మంది ఇప్పుడు ఉచిత రేషన్తో లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.

గత ప్రభుత్వాలు మణిపురి మహిళల జీవితాలకు ఏనాడూ భరోసా ఇవ్వలేదు
మణిపురి మహిళలు విదేశీ శక్తులపై చారిత్రాత్మకమైన పోరాటానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు మణిపురి మహిళల జీవితాలకు ఏనాడు భరోసా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే వారి సమస్యలను అర్థం చేసుకుని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు పని చేసిందని ప్రధాని మోదీ అన్నారు. మణిపూర్లో మొదటి విడత పోలింగ్ ఫిబ్రవరి 28 న జరగనుంది. తదుపరి దశ ఓటింగ్ మార్చి 5న జరుగుతుంది. కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications