Manipur elections: ఎన్నికల రీషెడ్యూల్ పై పరిశీలిస్తున్నాం; మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ విజ్ఞప్తిపై ఎన్ని
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశను రీషెడ్యూల్ చేయాలనే డిమాండ్ను ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు. ఇంఫాల్లో విలేకరుల సమావేశంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మణిపూర్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించారు.
ఫిబ్రవరి 3న, ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 27న జరగాల్సిన మొదటి దశ ఎన్నికల తేదీపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఫిబ్రవరి 27 ఆదివారం కావడంతో క్రైస్తవ సమాజానికి ఆరాధన దినమని, ఆ రోజు అందరూ ప్రార్థనల్లో బిజీగా ఉంటారని మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సిన మొదటి దశ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్లో క్రిస్టియన్స్ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 41% కంటే ఎక్కువ అని వారు పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులకు పరమపవిత్రమైన రోజున పెట్టిన ఎన్నికల తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్రంలోని పలు చోట్ల ఆ సంస్థ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులు తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఇక ఈ క్రమంలో తాజా ఎన్నికల పరిశీలనకు వచ్చిన ప్రధాన ఎన్నికల అధికారులను వారు కలిశారు. ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంఫాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల అధికారులు, సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన, ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ స్థానికంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్నికల తేదీని రీ షెడ్యూల్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మార్చి 3న రెండో దశ, మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. జనవరి 17న, ఎన్నికల సంఘం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. గురు రవిదాస్ జయంతి కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు ప్యానెల్ను కోరాయి. ఈ క్రమంలో పంజాబ్లో ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఎన్నికల కమిషన్ మణిపూర్లో కూడా మొదటి దశ ఎన్నికల రీ షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.