2జి స్కామ్పై ఆరోపణలకు జవాబు: మోడీపై మన్మోహన్ సింగ్ ఫైర్
న్యూఢిల్లీ: 2జి కుంభకోణం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ప్రధాని, కాంగ్రెసు నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రతిస్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఏ విధమైన ఆశ్రిత పక్షపాతం కూడా చూపించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తన సొంతానికి, కుటుంబ సభ్యుల కోసం లేదా స్నేహితుల కోసం వాడుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
2జి టెలికమ్ లైసెన్సుల విషయంలో సహకరించకపోతే బాగుండదని మన్మోహన్ సింగ్ హెచ్చరించినట్లు ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రదీప్ బైజాల్ తాను రాసిన ఓ పుస్తకంలో మన్మోహన్ సింగ్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అవినీతి పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల దృష్టిని అనవసరమైన విషయాల వైపు మళ్లిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం లేదని అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఆర్థికాభివృద్ధి స్తంభించిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
తాను అధికారం నుంచి దిగిపోయేనాటికి మన దేశం ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధించిన రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మోడీ ఏలుబడిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ఎన్ఎస్యుఐ జాతీయ సదస్సులో ఆయన బుధవారంనాడు ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య సంస్థలో ప్రమాదంలో పడ్డాయని ఆయన మండిపడ్డారు.