సీమాంద్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా: గొడవ మధ్య పిఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం రాజ్యసభలో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు బిల్లు ప్రతులు చించి విసిరారు. ప్రధాని చుట్టూ కాంగ్రెసు ఎంపీలు రక్షణగా నిలబడ్డారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... తాము అన్ని ప్రాంతాలు.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనను అర్థం చేసుకుంటున్నామన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. సీమాంధ్రకు ఆరు సూత్రాల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించారు.
సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నామన్నారు. పారిశ్రామిక హోదా కోసం పన్ను రాయితీ ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఆర్థికంగా ఎదగడానికే ప్రత్యేక హోదా ఉపకరిస్తుందన్నారు.
పోలవరం నిర్మాణానికి యూపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీమాంధ్రకు తొలి ఏడాది ద్వారా ఏర్పడే లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా పూడ్చుతామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహానికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై అవసరమైతే సవరణలు త్వరలో చేద్దామన్నారు.
వెంకయ్య అభ్యంతరం
సీమాంధ్ర ప్రాంతానికి కేవలం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్లు కావాలని పట్టుబట్టారు. పదేళ్ల పాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్య సవరణ ఇచ్చారు. అది వీగిపోయినట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు.