రాబోయేది మరింత గడ్డు కాలమే.. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: మన్మోహన్
పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఉపద్రవాన్ని మోడీ అంచనా వేయలేకపోతున్నారని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్ తాజాగా మరోసారి దానిపై స్పందించారు.
బుధవారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతోన్న మాటను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. నోట్ల రద్దుతో గత నవంబర్ లో దేశ జీడీపీ 2పాయింట్స్ నష్టపోయినట్టుగా పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఇబ్బందులకు లోనైందని తెలిపారు.మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.