60 ఏళ్ల కల నెరవేరింది: తెలంగాణపై మన్మోహన్
న్యూఢిల్లీ: లోకసభ తుది సమావేశంలో చివరి రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ తన వీడ్కోలు ప్రసంగంలో శుక్రవారం తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. శుక్రవారంతో 15వ లోకసభ ముగిసినట్లే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ కల నెరవేరిందని ఆయన అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోగలమని తాము నిరూపించుకున్నామని ప్రధాని అన్నారు.
తెలంగాణ అనేది జాతి నిర్ణయమని అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం ద్వారా ఈ దేశం నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించిందని ఆయన అన్నారు. ప్రతిబంధమైన స్థితిలోనూ తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకున్నామని ఆయన అన్నారు. తమ పనితీరును నిర్ణయించేందుకు ప్రజలకు ఓ అవకాశం లభించిందని ఆయన అన్నారు. 15వ లోకసభలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తమ పార్టీ అగ్రనేత ఆశీస్సులతో తనకు ప్రతిపక్ష నేతగా లోకసభలో పనిచేసే అవకాశం లభించిందని బిజెపి నేత సుష్మా స్వరాజ్ అన్నారు. పార్టీల మధ్య ఉండేవి విబేదాలే తప్ప శుత్రత్వం కాదని ఆమె అన్నారు. లోకసభ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
తనకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన పార్లమెంటు సభ్యులందరికీ ధన్యావాదాలు తెలుపుతున్నట్లు మీరా కుమార్ చెప్పారు. తదుపరి లోకసభకు మరింత మంది మహిళలు రావాలని ఆమె ఆశించారు. లోకసభలో మహిళ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటే మరింత సంతోషంగా ఉండేదని ఆమె అన్నారు.
తెలంగాణ బిల్లుకు బిజెపి పూర్తి సహకారం అందించిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. బిజెపి సహకారంతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications