మౌనమేలనోయి: మోడీపై సోనియా ఘాటు వ్యాఖ్య
న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు రసాభసాగా మారాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్ధేశించి నేరుగా విమర్శలు చేశారు. లలిత్ మోడీ వ్వవహారం, వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశమైన సోనియా గాంధీ ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ, 'మన్ కీ బాత్' చాంపియన్గా ఉన్న ఆయన, తన సహచరులు చేసిన అవినీతి కుంభకోణాలపై 'మౌన వ్రతం' పాటిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తిని ఆమె తోసిపుచ్చారు.
దేశంలో పాలన స్తంభించిపోయిందన్న ఆమె, ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలను మరచిపోయారని, వాటిల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేక పోయారని ధ్వజమెత్తారు. తాను నిజాయతీగా ఉంటానని, పారదర్శకత పాటిస్తున్నానని ఒక వైపు చెప్తూనే, మరోవైపు తన విదేశాంగ శాఖ మంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు.

అదే యూపీఏ పాలనలో 'ముందు రిజైన్, తరువాతే చర్చ' అన్న నినాదాన్ని తెరపైకి బీజేపీ తెచ్చిందని, ఇప్పుడు తాము దాన్నే పాటిస్తున్నామని అన్నారు. లలిత్ మోడీ వ్యవహారంతో పాటు వ్యాపం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ల సీఎంలు రాజీనామాలను ఆమోదించే వరకు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వం, కాంగ్రెస్ పట్టింపులకు పోయి పార్లమెంట్ను స్తంభింపచేయడం సరికాదని వాపోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, అందుకు విపక్షాలు సహకరించాలని బీజేపీ కోరింది. అఖిలపక్ష సమావేశం విఫలం కావడంతో బీజేపీ వేరే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ దారికి రాకపోతే తమకున్న సంఖ్యాబలంతో లోక్సభలో బిల్లులను ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications