నన్ను జైల్లో పెట్టండి: ప్రధాని మోడీకి రాహుల్ సవాల్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలంటూ నరేంద్ర మోడీ సర్కార్కు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.
రాహుల్ నాయనమ్మ, భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ తనపై లేనిపోని ఆరోపణలను చేస్తోందన్నారు. తాను బ్రిటీష్ పౌరుడినంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
మోడీకి తాను భయపడనని, అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నేతలు తనపై, తన కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని రాహుల్ హితవు పలికారు.
‘మోడీజీ ప్రధానిగా ఉన్నారు. ఆయన ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. చాలా విషయాలకు సంబంధించి నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నింటిపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరు?' అంటూ రాహుల్ ప్రశ్నించారు.
తనపై వస్తున్న ఆరోపణలపై ఆరు నెలల్లోగా విచారణ జరిపి.. తప్పు చేసినట్లు తేలితే తనను జైలుకు పంపండని ప్రధానికి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్పైనా విమర్శలు చేశారు. దేశానికి చెడ్డపేరు తెస్తోందంటూ ఆర్ఎస్ఎస్పై మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా, రాహుల్ సవాల్పై షానవాజ్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ సవాళ్లు విసరాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ బావ, రాబర్ట్ వాద్రాపై అనేక విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనంటేనే అవినీతి లేకుండా సాగదని ధ్వజమెత్తారు.