మర్కజ్ చీఫ్ పరారీ.. సంచలన టేప్స్.. కరోనాతో చనిపోతే దేవదూతలైపోతారు.. వైరస్తో అందర్నీ కలవాలంటూ..
''కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 70 వేల మంది చనిపోయారని చెబుతున్నారు. నిజానికి వాళ్లంతా దేవదూతలుగా మారారు. ఏ డాక్టరైనా మిమ్మల్ని రక్షించగలడా? ఆ 70 వేల మంది దేవదూతల్ని తానే సంక్షణలోకి తీసుకున్నానని సాక్ష్యాత్తూ భగవంతుడే చెబితే.. ప్రపంచంలోని ఏ శక్తయినా వ్యతిరేకించగలదా? క్వారంటైన్ విధానం ఫక్తు అంటరాని తనం. ఇది భయాన్ని, అంటరానితనాన్ని వ్యాపించే సమయం కాదు. డాక్టర్ల మాట అసలే వినాల్సిన పనిలేదు. అన్నింటికంటే ముఖ్యంగా సామూహిక ప్రార్థనల్ని ఆపనే ఆపొద్దు..'' అని ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ చెప్పినట్లుగా పేర్కొన్న ఆడియో, వీడియో టేపులు సంచలనం రేపుతున్నాయి.

అసలేం జరిగిందంటే..
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం.. స్కూళ్లు, కార్యాలయాలు మూసేయడంతోపాటు సామూహిక ప్రార్థనల్ని కూడా నిషేధించింది. అయితే అప్పటికింకా రవాణా వ్యవస్థను నిలుపుదల చేయకపోవడంతో నిజాముద్దీన్ మర్కరజ్ లో జరిగిన తబ్లీగీ జమాత్ ప్రార్థనకు విదేశాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల మంది హాజరయ్యారు. అక్కడివాళ్లలో చాలా మందికి వైరస్ సోకడంతో.. మర్కజ్ మసీదును దేశంలోనే అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందింది. అయితే సమావేశం విషయంలో మర్కజ్ వాదన పోలీసుల కథనానికి భిన్నంగా ఉంది.

పరారీలో మౌలానా సాద్..
సామూహిక ప్రార్థనల విషయంలో తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదని మర్కజ్ మసీదు ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే వాళ్లు చెప్పేది వాస్తవం కాదని, మార్చి 22 లాక్ డౌన్ తర్వాత కూడా అక్కడ వేల మంది గుమ్మికూడా ఉన్నారని, 23న నోటీసులిచ్చి ఖాళీ చేయాలని కోరినా వినిపించుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మర్కజ్ వైరస్ హాట్ స్పాట్ గా మారడానికి కారకులంటూ మతపెద్ద మౌలానా సాద్, ఇతర గురువులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897లోని సెక్షన్-3 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అరెస్టుకు ముందే మర్కజ్ చీఫ్ సాద్ పరారైపోయారు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈలోపే..

భార్యాబిడ్డలతో బయటికి రండి..
తబ్లీగీ జమాత్ లో మౌలానా సాద్ ప్రసంగంగా చెబుతోన్న ఆడియో, వీడియో టేపుల్ని పలు జాతీయ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. అందులో సాద్.. కరోనా వైరస్ ను ముస్లింలను విడదీసేందుకు జరుగుతోన్న కుట్రగా అభివర్ణించారు. ‘‘మనల్ని ఒక్కటిగా ఉండనీయకుండా.. కలిసి భోజం చేయనీయకుండా కుట్రలు సాగుతున్నాయి. వైరస్ లక్షణాలు కనిపించినా మీరు భయపడొద్దు. మునుపటికంటే సామూహిక ప్రార్థనలు బలంగా చేయండి. భార్యాబిడ్డలతో కలిసి బయటికి రండి, కలిసుండటంలోనే బలముందని మర్చిపోకండి..''అని సాద్ పేర్కొన్నారు. అయితే ఈ టేపులు ఎక్కణ్నుంచి లభించాయన్నదాన్ని మాత్రం సదరు టీవీ చానెళ్లు వెల్లడించలేదు.

మతం రంగు..
మర్కజ్ వ్యవహారం తర్వాత దేశంలో కరోనాపై చర్చ ఊహించని మలుపు తిరిగింది. మతాలకు ప్రతినిధులమని చెప్పుకునే పార్టీలు పరస్పరం వాదులాడుకుంటున్నాయి. సాద్ టేపులు బయటపడటంతో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తికి సంబంధించి మర్కజ్ లో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. దీన్ని ముస్లిం సంస్థలు ఖండిచాయి. మామూలు ప్రజాస్వామిక వాదులు సైతం విపత్కర పరిస్థితుల్లో విషయానికి మతం రంగులు పులమొద్దని వేడుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..
లాక్ డౌన్ తర్వాత భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. బుధవారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా మొత్తం 1745 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 327 కేసులు, కేరళలో 241 కేసులు నమోదుకాగా, మరో ఐదు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 100 దాటింది. మర్కజ్ ఉదంతంలో తెలంగాణలో మొత్తం కేసులు 92కు, ఏపీలో మొత్తం కేసులు 87కు పెరిగాయి.












Click it and Unblock the Notifications