అలా చేస్తే నేరమే: ‘భార్య ఎల్లవేళలా శృంగారానికి సిద్ధంగా ఉండాల్సినవసరం లేదు’
న్యూఢిల్లీ: వివాహ బంధంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. శారీరక సంబంధాన్ని నిరాకరించే హక్కు భార్యాభర్తలిద్దరికీ ఉంటుందని స్పష్టం చేసింది.

భాగస్వామిపై అత్యాచారం నేరమే..
జీవిత భాగస్వామిపై బలవంతంగా చేసే శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ సి.హరిశంకర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

పెళ్లంటే..
‘పెళ్లంటే భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు భార్య ఎల్లవేళలా సంసిద్ధంగా, సమ్మతంతో ఉండటం కాదు. ఆమె అంగీకారంతో ఉన్నట్లు భర్త నిర్ధారించుకోవాలి' అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జీవిత భాగస్వామిపై అత్యాచారం కేసుల్లో బలప్రయోగం వంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ ‘మెన్ వెల్ఫేర్ ట్రస్ట్' స్వచ్ఛంద సంస్థ చేసిన వాదనతో న్యాయస్థానం విభేదించింది.

పూర్తిగా మారిపోయింది..
అంతేగాక, ‘అత్యాచారానికి శారీరక బలం అవసరమని చెప్పడం సరికాదు. అత్యాచారం కేసుల్లో గాయాల కోసం చూడాల్సిన పనిలేదు. ప్రస్తుతం అత్యాచారం నిర్వచనం పూర్తిగా మారిపోయింది' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇలా చేసినా కూడా..
‘బల ప్రయోగం ద్వారా అత్యాచారం చేయాల్సిన పనిలేదు. తనతో శృంగారంలో పాల్గొనకపోతే ఇంటి ఖర్చులకు, పిల్లలకు డబ్బు ఇవ్వబోనని భార్యను భర్త ఆర్థికపరమైన ఒత్తిడికి గురిచేస్తే.. ఆ బెదిరింపులకు భయపడి ఆమె శృంగారంలో పాల్గొనాల్సి వస్తుంది. అలాంటప్పుడు భర్తపై ఆమె అత్యాచారం కేసు దాఖలు చేస్తే ఏమవుతుంది?' అని ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications