వైరల్ వీడియో.. ముఖానికి ముసుగులు,చేతిలో ఆయుధాలతో జేఎన్యూలో మూక హల్చల్..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండలో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూకదాడికి పాల్పడినవారికి పోలీసులు సహకరించారని వామపక్ష విద్యార్థి సంఘాలు,పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీ లోపల స్వేచ్చగా తిరుగుతున్న ముసుగు మూక వీడియోను కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు.
చేతిలో ఆయుధాలు,ముఖాలకు ముసుగులతో క్యాంపస్లో వారు హల్చల్ చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాంతియుత నిరసనలకు దిగితేనే అరెస్టులు చేసే పోలీసులు.. ఇలా ఆయుధాలతో వచ్చినవారిని ఎలా ఉపేక్షించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఘటన తర్వాత 10.45గం. సమయంలో దాడులకు పాల్పడ్డ మూక జేఎన్యూ గేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అంతేకాదు,దాడిలో గాయపడ్డవారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన అంబులెన్సుల టైర్లలో గాలి కూడా తీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్యూ గేట్ వద్ద పోలీసుల ఎదుటే ఇదంతా జరుగుతున్నా.. వారెందుకు పట్టించుకోలేదని విద్యార్థులు,రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారణకు ఆదేశించారు.
Masked Attackers openly roaming inside university campus..
— Dhruv Rathee (@dhruv_rathee) January 5, 2020
Delhi Police is normally super quick to detain people even for peaceful protests, so how can this be possible? There’s only one explanation, use your common sense. #JNUAttack pic.twitter.com/XgjzQLTEVD
Recommended Video
జేఎన్యూ హింసాకాండపై ఏబీవీపి,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దాడులకు పాల్పడింది ఏబీవీపీయే అని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తుండగా.. వామపక్ష విద్యార్థులే మొదట తమవారిపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. ఏదేమైనా ఆదివారం సాయంత్రం జేఎన్యూ క్యాంపస్లో మూడు గంటల పాటు తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. జరిగిన హింసాకాండలో దాదాపు 20 మంది గాయపడగా వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జేఎన్యూలో దాడిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు అక్కడి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి. జామియా యూనివర్సిటీ,అలీఘడ్ యూనివర్సిటీ,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిరసనల ద్వారా ఈ దాడిని ఖండించాయి.