తమతో కలిసి ఫోటో దిగాలని బాలికలకు వేధింపు, దాడి
చెన్నై: మాస్క్ ధరించిన అయిదుగురు యువకులు తమిళనాడులోని ఓ పాఠశాల పరిసరాల్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థినీలు గాయపడ్డారు. దాడికి పాల్పడిన అనంతరం వారు అక్కడి నుండి పరారయ్యారు. ఆ ఇద్దరి బాలికలకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని అంబాయి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
దాడి నేపథ్యంలో నిందితులను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు ఆందోళన బాట పట్టడంతో కడయం - పొట్టాపుతూర్ రహదారిలో దాదాపు గంటసేపు ట్రాఫిక్ జాం అయింది.
కాగా, బుధవారం పోలీసులు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన అయిదుగురిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులు తమ వద్ద ఉన్న కత్తులతో విద్యార్థినీలను భయపెట్టారని, గత వారం రోజులుగా వారు అమ్మాయిలని టీజ్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు, తమతో కలిసి ఫోటో దిగాలని వారిని నిందితులు వేధించారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ సంఘటన తమిళనాడులోని తిరనల్వేలీలో జరిగింది.