పార్లమెంటు నుంచి పుల్వామా దాడుల వరకు మసూద్ హస్తం: ఇలాంటి నీచుడినా చైనా వెనకేసుకొచ్చేది...?
భారత్ పై పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాది జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చే విషయమై చైనా మద్దతు తెలపక పోవడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా జైషేమహ్మద్ దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నదని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ చైనా మసూద్కు అండగా నిలబడటాన్ని తప్పుబడుతున్నాయి ప్రపంచదేశాలు. ఇంతకీ జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ ఎలాంటి ఉగ్రదాడులకు పాల్పడ్డాడు... ఎంత మందిని బలిగొన్నాడు...?
అన్ని దాడుల వెనక మసూద్ అజార్ హస్తం
మసూద్ అజార్... ప్రపంచాన్ని ఉగ్రదాడులతో గడగడలాడిస్తున్న ఉగ్రవాది. భారత పార్లమెంటుపై దాడి అయినా... యూరీ ఉగ్రదాడులైనా, పఠాన్కోట్ దాడులైనా, కొద్దిరోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడులైనా... దాడి ఏదైనా సరే ఇతని మాస్టర్ బ్రెయిన్ దీని వెనక ఉంది. ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న రాక్షసుడు మసూద్ అజార్. యువతను ఉగ్రవాదంలోకి లాగి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ దాడులు చేయించడంలో సిద్ధ హస్తుడు. పాకిస్తాన్ వేదికగా వ్యూహాలను రచించి ఆత్మాహుతి దాడులు చేయించడంలో దిట్ట. ఇలాంటి నరరూప రాక్షసుడిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మెజార్టీ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు బ్లాక్ లిస్టులో చేర్చాలని ప్రతిపాదన తీసుకొచ్చిన ప్రతిసారీ చైనా మసూద్ అజార్ను కాపాడుకుంటూ వస్తోంది. ఈసారి కూడా అదే జరిగింది.
పార్లమెంటుపై దాడిలో 9 మంది మృతి
జైషే మహ్మద్ చేసిన ప్రతి దాడులు తాము చేసినవే అని స్వయంగా మసూద్ అజార్ ప్రకటిస్తున్నప్పటికీ చైనా మాత్రం కుంటిసాకులు చూపుతోంది. 2001లో డిసెంబరు 13న ఉదయం జైషే మహ్మద్, లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 9 మంంది పోలీసు సిబ్బంది అమరులయ్యారు. కారులో పార్లమెంటు ఆవరణంలోకి దూసుకొచ్చిన ఉగ్రవాదులు గ్రెనేడ్లు, ఏకే 47 తుపాకులతో దాడి చేశారు. అయితే అప్రమత్తమైన భారత పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
బయటపడ్డ డ్రాగన్ బుద్ధి: మసూద్ అజార్ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా
పఠాన్ కోట్ ఉగ్రదాడులు
2016 జనవరి 2వ తేదీన పఠాన్కోట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్పై ఉగ్రదాడులు జరిగాయి. భారత వాయుసేనకు సంబంధించిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్గా సేవలందిస్తోంది పటాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మిలటరీ దుస్తులు ధరించిన ఈ ఉగ్రవాదులు జనవరి 1 రాత్రి పటాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు సమీపంలో దాక్కున్నారు. అనంతరం జనవరి 2వ తేదీన గ్రెనేడ్లు ఏకే 47 గన్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మొత్తం 8 మంది మృతి చెందారు. భారత బలగాలు ఎదురు కాల్పులకు దిగి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
యూరీ ఉగ్రదాడులు
2016 సెప్టెంబరు 18న జమ్ముకశ్మీర్లోని యూరీ సెక్టార్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు తెల్లవారు జామున అంతా గాఢ నిద్రలో ఉండగా భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు.మూడు నిమిషాల్లో 17 గ్రెనేడ్లు విసిరారు. టెంట్లు అంటుకోవడంతో 19 మంది జవాన్లు అగ్నికి ఆహుతయ్యారు. ఆ తర్వాత భారత బలగాలు ఎదురుకాల్పులకు దిగి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాదాపు ఆరుగంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
పుల్వామా ఉగ్ర దాడులు
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనికి బాధ్యత తమదే అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసింది. అనంతరం పాకిస్తాన్ భారత గగనతలంలోకి తమ యుద్ధ విమానాలతో రావడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆ విమానాలను తరిమికొట్టింది.
ఇన్ని దాడులు ఇంతమంది ప్రాణాలు తీసింది జైషే ఉగ్రవాద సంస్థ అని స్పష్టంగా తెలిసినప్పటికీ చైనా మసూద్ అజార్పై మెతక వైఖరి అవలంబిస్తూ కుంటిసాకులు చెప్పడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చైనా ఏమి ఆశించి అజార్కు అండగా నిలుస్తోందో ముందుగా తెలియాల్సి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.