కరోనా విషాదం: ఇదే నా చివరి ‘గుడ్ మార్నింగ్’ అంటూ పోస్టు చేసిన గంటల్లోనే వైద్యురాలి మృతి
ముంబై: కరోనా మహమ్మారి అనేక మంది జీవితాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోత్పోతూనే ఉన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా బారిన పడేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మనదేశంలో ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తూ అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా, ఓ మహిళా వైద్యురాలి మరణం అందర్నీ కలిచివేసింది.

మరణాన్ని ముందే ఊహించిన డాక్టర్ మనిషా జాదవ్..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో స్వెరి టీపీ ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ మనీషా జాదవ్(51) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తన మరణానికి ముందు తన ఫేస్బుక్ ఖాతాలో ఆమె చేసిన పోస్టు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. క్షయ వ్యాధి నిపుణురాలిగా ఉన్న మనీషా ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే, తన మరణాన్ని ముందే ఊహించిన ఆమె ఇకపై తాను బతికి ఉండకపోవచ్చనే సంకేతాలను ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇదే చివరి గుడ్మార్నింగ్ అంటూ..
'ఇదే చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు. ఈ వేదికపై నేను మిమ్మల్ని మళ్లీ కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. మరణం శరీరానికే. ఆత్మకు కాదు. ఆత్మకు మరణం లేదు' అని మనీషా ఆదివారం ఉదయం తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ సందేశం పోస్టు చేసిన 36 గంటల్లోనే ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె చేసిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ఆమె మరణం పట్ల అనేకమంది నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారితో భయానక పరిస్థితులు
ఇది ఇలావుంటే, మరో మహిళా వైద్యురాలు కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఓ వీడియోలో హెచ్చరించారు. కరోనా ఉధృతితో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, కరోనా రోగుల పట్ల పలు సందర్భాల్లో తాము నిస్సహాయులుగా మారిపోతున్నామని ముంబైకి చెందిన వైద్యురాలు డాక్టర్ తృప్తి గిలాడి ఆవేదన వ్యక్తం చేశారు.
మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలు పాటిస్తేనే ఆ మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. దేశంలో పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయని, ముఖ్యంగా ముంబైలో మరింత దయానీయంగా మారాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరకడం లేదన్నారు. వైద్యులు, వారి బంధువులకు కూడా పడకలు దొరడం లేదని వాపోయారు. వైద్య వృతిల్లో తాము కూడా నిస్సహాయులుగా మారిపోతున్నామని భావోద్వేగానికి గురయ్యారు.
మనం సూపర్ హీరోలమేం కాదు..
మనం సూపర్ హీరోలం కరోనా రాదు అని ఎవరూ అనుకోవద్దని డాక్టర్ తృప్తి గిలాడి హితవు పలికారు. ఎంతో మంది యువకులు వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారని చెప్పారు. మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదనే కోరుకుంటున్నాం. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. స్వల్ప అనారోగ్యం ఉంటే ఆస్పత్రికి అవసరం లేదు.. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తీవ్ర అనారోగ్యమైతేనే ఆస్పత్రులకు రావాలి. కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దు. అందరూ జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా మూడో దశను సమర్థంగా ఎదుర్కోగలం. నియంత్రించగలం అంటూ డాక్టర్ తృప్తి స్ఫష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు తమ కోసం ఆమె పడిన ఆవేదనకు ధన్యవాదాలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications