బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పనిచేస్తా, ఆరోజు బ్లాక్ డే: మాయావతి
యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 'మార్చి11'ను మాయావతి బ్లాక్ డే గా ప్రకటించారు. ప్రతీ నెలా మార్చి11న బీఎస్పీ కార్యకర్తలంతా యూపీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తారని తెలిపారు.
లక్నో: అంబేడ్కర్ ఐడియాలజీతో కాన్షీరాం మార్గనిర్దేశంలో పురుడు పోసుకున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీ దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ క్రమంలో ఆ పార్టీ బలహీనపడటం దేశంలో బహుజన రాజకీయాలను సైతం కలవరపరుస్తోంది.
తాజా యూపీ ఎన్నికల్లోను బీఎస్పీ దారుణంగా దెబ్బతినడం ఆ పార్టీని సైతం అంతర్మథనంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక సంచలన ప్రకటన చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేకంగా పనిచేసే ఏ కూటమితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు.

శుక్రవారం నాడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న మాయావతి ఈ ప్రకటన చేశారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే యూపీలో బీజేపీ విజయం సాధించిందని మాయావతి మరోసారి ఆరోపించారు. 2019ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నిజానికి ఇటీవల ఎన్నికల సమయంలోను ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేస్తే యూపీలో బీజేపీకి అవకాశం ఉండదని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్లను కలుపుకుంటే బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్య కూడా తక్కువే. ఈ లెక్కన ఎస్పీ, బీఎస్పీ గనుక అప్పుడే జత కట్టి ఉంటే యూపీలో బీజేపీకి అవకాశం దక్కి ఉండకపోయేది.
ఈ నేపథ్యంలోనే బీజేపీని ఎదుర్కోవడానికి దాని వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలని మాయావతి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ 'మార్చి11'ను మాయావతి బ్లాక్ డే గా ప్రకటించారు. ప్రతీ నెలా మార్చి11న బీఎస్పీ కార్యకర్తలంతా యూపీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications