మోడీ ముందు దిగదుడుపే: కాంగ్రెస్ విముక్త భారత్ కలనే...
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు ప్రజాదరణ తగ్గిపోవడంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి పంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు ప్రజాదరణ తగ్గిపోవడంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి పంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ స్థానాలు, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
అయితే తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే సుదీర్ఘ కాలం పెడ్తుందని అంటున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంసీడీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినా కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ అన్న కమలనాథుల ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ కల సాకారం అయ్యేలా కనిపించడం లేదని విమర్శకులు చెప్తున్నారు.
2014 లోక్సభ ఎన్నికలు మొదలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో నిరంతరం పరాజయాల బాటలోనే పయనిస్తున్నది. బీజేపీ ప్రభంజనం సృష్టించినా ఆ పార్టీ నిలబెట్టిన ఐదుగురు ముస్లిం అభ్యర్థులూ ఓటమిపాలయ్యారు. ఢిల్లీ మున్సిపాలిటీలోని 272 స్థానాలకుగాను ఐదు స్థానాల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. ఈ ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీలో ఐదుగురు ముస్లిం అభ్యర్థులకూ తప్పని ఓటమి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఐదుగురిని ఎంసీడీ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ముస్లింలకు టికెట్ ఇవ్వకున్నా యూపీలో ఆయా వర్గాలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను సైతం బీజేపీ గెలుచుకున్నది. అందుకు భిన్నంగా ఢిల్లీలో ఐదుగురిని బరిలోకి దింపినా బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి గెలువకపోవడం గమనార్హం.
ఎంసీడీ ఎన్నికల్లో ఇలా
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) పాలక మండళ్లలో వరుసగా మూడోసారి బీజేపీ కొలువుదీరడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే సమయంలో 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ముందు బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ కాంగ్రెస్ పార్టీ రహిత భారత్ ఆవిర్భవింపజేయాలన్న బీజేపీ కలలు సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనా.. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నాయకత్వం తీరు పట్ల ప్రజలు విసుగెత్తారు. క్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు దూరమవుతూ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ వ్యూహం ముందు కాంగ్రెస్ విలవిల
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పదేళ్ల కాలం శిరోమణి అకాలీదళ్ - బీజేపీ పాలనను మాత్రం కాంగ్రెస్ పార్టీ అంతమొందించగలిగింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర బీజేపీ నేతలు అనుసరిస్తున్న నూతన రాజకీయ వ్యూహం, ఎత్తుగడల ముందు ఏడు దశాబ్దాలకు పైగా భారతదేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ విలవిలలాడింది.
మోదీ ‘కాంగ్రెస్'ముక్త భారత్ నినాదానికి ఇదీ నేపథ్యం
కమలనాథుల నూతన ఒరవడి ముందు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ గత లోక్ సభ ఎన్నికల్లో 543 స్థానాలకు కేవలం 44 స్థానాలకు మాత్రమే పరిమితమై చరిత్రలో తొలిసారి ఘోర పరాజయానికి గురైన సంగతి అందరికీ తెలిసిన సత్యమే. నాటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ ‘కాంగ్రెస్ ముక్త భారత్' నినాదాన్ని అందుకున్నారు. తర్వాతీ కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పరాజయ బాటలో పయనిస్తూ అనుక్షణం కోలుకోలేని స్థాయికి పడిపోతూ వస్తున్నది.
కేజ్రీవాల్ చేతిలో షీలా దీక్షిత్ ఘోర పరాజయం
వరుసగా 15 ఏళ్ల పాటు దేశ రాజధాని ‘హస్తిన'గా పేరొందిన ‘ఢిల్లీ' రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకున్నది. బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) 28 స్థానాల్లో గెలుపొందింది. అంతేకాదు రికార్డు స్థాయిలో 15 ఏళ్ల పాటు ఢిల్లీని ఒంటిచేత్తో ముందుకు నడిపించిన షీలా దీక్షిత్ కూడా కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 24.5 శాతం ఓటింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 29.5 శాతం, బీజేపీకి 33 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఆప్కు మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరొక పొరపాటు చేసింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా ఆప్కు మళ్లింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 24.5 శాతం నుంచి 9.7 శాతానికి పరిమితం కావడంతోపాటు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ 33 శాతం ఓటింగ్ పొంది మూడు స్థానాలను గెలుచుకోగలిగింది. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ద్వారాలు మూసుకుపోయాయన్న సంకేతాలు కనిపించాయి.
ఇలా బీహార్, పంజాబ్ మినహా ‘హస్తం' పార్టీ వైఫల్యం
పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలకంటే తక్కువ ఫలితాలనిచ్చింది. కాకపోతే యునైటెడ్ జనతాదళ్, ఆర్జేడీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినా.. కమలనాథుల దూకుడు ముందు నిలబడలేకపోయింది. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఎంసీడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా
కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల ఫలితాలు ఊపిరి పోస్తున్నాయి. 272 డివిజన్లకు గాను 180కి పైగా స్థానాలను బీజేపీకి గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లోనే గెలిచినా ఢిల్లీలో తిరిగి పూర్వ వైభవం సంపాదించుకునే అవకాశాలు మెరుగయ్యాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఆప్ కు తరలిన ఓటు బ్యాంకును హస్తగతం చేసుకునే క్షణాలు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే దానికి సుదీర్ఘ కాలం పట్టొచ్చు. ఆప్ తగ్గినా కొద్దీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం తథ్యంగా కనిపిస్తున్నది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏడు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పుషల్కంగా కనిపిస్తున్నాయి.
కమలనాథులపై కాంగ్రెస్ పార్టీ ఇలా
ఈ నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పదునైన విమర్శలతో విరుచుకుపడింది. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో ఏదో మొక్కుబడిగా బీజేపీ ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిందని, ముస్లిం ప్రజలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్దుల్ రసూల్ ఖాన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ముస్లింలపై మతపరమైన దాడులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఓవైపు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. మరోవైపు పేదలపై దాడులు జరుగుతున్నాయని, వారి చర్యలు ముస్లింలకు బీజేపీకి అక్కరలేదన్న సంకేతాన్ని ఇస్తున్నాయని, లౌకికవాదం, సహజీవనం ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీకి ముస్లింలు ఓటేస్తారన్నది భ్రమేనని ఓ ఆరెస్సెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.