ఆసుపత్రిలో అమ్మాయిల చిందులు, రోగుల అవస్థ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఓ ఆసుపత్రిలో షాకింగ్ అంశం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిని ఫంక్షన్ హాలులా మార్చేశాడు ఓ ఉద్యోగి. ఈ తీరుతో ఆసుపత్రిలోని రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన యూపీలోని బులంద్ షహర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ఈ సంఘటన రెండు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తన కూతురు వివాహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించాడు. వివాహ వేడుకల్లో భాగంగా పాటలు, డ్యాన్సులు, హోరెత్తించారు. దీంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వైద్యులు, నర్సులతో సహా చాలామంది సిబ్బంది అంతా పెళ్లికి హాజరు కావడంతో రోగులను ఎవరూ పట్టించుకోలేదు. వృద్ధులు, గర్భిణీలు ఇలా చాలామంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఘటన పైన ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
ఆసుపత్రి సిబ్బంది అక్కడే మ్యారేజీ పార్టీ చేసుకోవడం, విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, చిందులు వేయడం, మరో పక్క రోగులు సాయం కోసం అర్థిస్తున్నా వైద్యులకు పట్టలేదు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.