గుజరాత్ ఎన్నికల్లో కోటీశ్వరుల చిట్టా: ఏ పార్టీలో ఎంతమంది?, ఎవరికెన్ని 'కోట్లు'?
అహ్మదాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రలోభాలకు తావు లేని ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. డబ్బు, మద్యం ఏరులైపారుతూనే ఉంది.
Recommended Video
ఒకరకంగా ఎన్నికల ముఖచిత్రాన్ని ఓ మార్కెట్ తరహాలో మార్చిపారేశారు నాయకులు. ఓటర్లను అందులో ముడిసరుకుల్లా ప్రాంతానికో రేటు ఫిక్స్ చేసి మరీ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో ఎన్నికలంటేనే కోట్లతో ముడిపడి ఉన్న వ్యవహారంగా మారిపోయింది. అదే సమయంలో సామన్యుడు ఎన్నికల్లో పోటీ చేయడమనేది రోజురోజుకు జటిలమైపోతున్న పరిస్థితి నెలకొంది.
ఎన్నికలంటే కోటీశ్వరులే:
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కోటీశ్వరులే బరిలో దిగడం పరిపాటైపోయింది. సమర్థత కన్నా కోట్లు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్నే పార్టీలు పరిగణలోకి తీసుకుంటాయన్నది కాదనలేని అంశం. తాజా గుజరాత్ ఎన్నికల్లోను ఇదే రిపీటైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 397మంది కోటీశ్వరులు ఆయా పార్టీల అభ్యర్థులుగా ప్రస్తుతం బరిలో నిలిచినట్లు వెల్లడైంది.
బీజేపీ-78, కాంగ్రెస్-70శాతం:
మొత్తం 182సీట్ల రెండు విడుతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇందుకోసం 1,828మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 182సీట్లకు గాను తొలిదశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అభ్యర్థుల్లో 397మంది కోటీశ్వరులు ఉండగా.. ,1098 మంది అభ్యర్థుల విద్యార్హత 12వ తరగతి కంటే తక్కువేనని గుజరాత్ ఎలక్షన్ వాచ్ వెల్లడించడం గమనార్హం. బీజేపీ నుంచి 78శాతం మంది, కాంగ్రెస్ నుంచి 70శాతం మంది కోటీశ్వరులైన అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తొలి విడుతలో
తొలి దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 977 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 198 మంది కోటీశ్వరులే. ఈ విషయం వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది.
ఇక రెండో దశలో 851 మంది బరిలో ఉండగా.. వారిలో 199 మంది కోటీశ్వరులున్నారు. మొత్తం 397మంది కోటీశ్వరుల్లో.. 131 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. 5కోట్ల పైచిలుకే. ఇక మరో 124 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. 2 కోట్ల-రూ. 5కోట్ల మధ్య ఉన్నాయి.
ఏ పార్టీ నుంచి ఎంతమంది?:
ఇక పార్టీల వారీగా ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారన్నది పరిశీలిస్తే.. బీజేపీ నుంచి 142మంది, కాంగ్రెస్ నుంచి 127మంది, ఎన్సీపీ నుంచి 17మంది, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 13మంది, బీఎస్పీ నుంచి ఐదుగురు కోటీశ్వరులు గుజరాత్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలోను 56 మంది కూడా కోటీశ్వరులని తేలడం గమనార్హం.
గుజరాత్ ఎన్నికల బరిలో నిలిచిన కోటీశ్వరుల్లో అందరి కన్నా కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ పటేల్కు అత్యధికంగా రూ. 231 కోట్ల ఆస్తులు ఉన్నాయి. గుజరాత్ సీఎం విజయ్ రూపానిపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజగురుకు రూ. 141.22 కోట్ల ఆస్తులున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో సౌరభ్ పటేల్ (రూ.123కోట్లు), ధన్జీ భాయ్ పటేల్ (రూ.113కోట్లు) ఉన్నాయి.