షాక్: మోడీపై విమర్శలు: పాక్ హైకమిషన్ తో మణిశంకర్ అయ్యర్ భేటీ, నిజమే, పాక్!
న్యూఢిల్లీ: గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీని నీచ్ (నీచుడు) అంటూ ఏకవచనంతో అభ్యంతరకరంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మణిశంకర్ అయ్యర్ పాక్ అధికారులతో భేటీ అయ్యారని వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు. మా దేశ అధికారితో మణిశంకర్ అయ్యర్ భేటీ అయ్యారని ఇదే సమయంలో పాకిస్థాన్ దృవీకరించింది.
పాక్ హైకమినర్ షోయబ్, అయ్యర్!
ప్రధాని నరేంద్ర మోడీని అసభ్యంగా దూషించి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మణిశంకర్ అయ్యర్ తో తమ హైకమిషనర్ షోయబ్ మెహమూద్ సమావేశమైనట్లు శనివారం పాకిస్థాన్ దృవీకరించింది. తటస్థ ప్రదేశంలో ఈ సమావేశం జరిగిందని పాకిస్థాన్ స్పష్టం చేసింది.
భారత్ లో పాక్ మాజీ మంత్రి!
పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కసూరీ ప్రస్తుతం భారత్ లోనే ఉన్నారని, ఆయనతో వీరు సమావేశమై ఉండవచ్చునని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. పాక్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కసూరీ భారత దేశంలోని అనేక మంది నేతలను కలుస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ వివరించింది.
నీచ్ వెనుక పాక్ హస్తం!
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మణి శంకర్ అయ్యర్ నీచ్ (నీచుడు) వ్యాఖ్యల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని బోఫోర్స్ పిటిషనర్, బీజేపీ సీనియర్ నాయకుడు అజయ్ అగర్వాల్ ఆరోపించారు. పాకిస్థాన్ హై కమిషన్ నిర్వహించిన ఓ రహస్య సమావేశంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నారని అజయ్ అగర్వాల్ మీడియాకు చెప్పారు.
పాక్ అధికారులతో అయ్యర్ చర్చలు!
ఈ రహస్య సమావేశంలో పాకిస్థాన్ హై కమిషనర్ షోయబ్ మెహమూద్ తోపాటు పాకిస్థాన్ అధికారులు కూడా పాల్గొన్నారని అజయ్ అగర్వాల్ అన్నారు. ఈ నెల 6న మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాక్ అధికారులతో సమావేశం జరిగిందని అజయ్ అగర్వాల్ ఆరోపించారు.
పాక్ తో చర్చలు వెంటనే మోడీ మీద!
పాకిస్థాన్ హై కమిషన్ అధికారులతో భేటీ అయిన తరువాతే రోజే మణిశంకర్ అయ్యర్ ప్రధాని నరేంద్ర మోడీని నీచ్ (నీచుడు) అంటూ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారని, పాక్ అధికారులు చెప్పడం వలనే ఆయన ఇలా మట్లాడారని బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ ఆరోపించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్!
సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం భారత మాజీ ప్రధానితో భేటీ కావాలనుకే విదేశీయులు ఆయన నివాసానికే వెళ్లాలని అధికారులు అంటున్నారు. అయితే మణిశంకర్ అయ్యర్ నివాసం వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సెక్యూరిటీని తాను స్వయంగా చూశానని బీజేపీ నేత అజయ్ అగర్వాల్ చెప్పారు.
మన్మోహన్ విషయంలో పాక్ మౌనం!
మా విదేశాంగ శాఖ అధికారులతో మణిశంకర్ అయ్యర్ భేటీ అయ్యారని పాకిస్థాన్ శనివారం దృవీకరించింది. ఈ విషయం పాక్ చెప్పక ముందే బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ మీడియాకు చెప్పారు. అయితే పాక్ హై కమిషన్ అధికారులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారా ? లేదా ? అనే విషయంలో పాకిస్థాన్ మాత్రం క్లారిటీ ఇవ్వకుండా మౌనంగా ఉంది.