రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం, అమితాబ్ సినిమా 50సార్లు చూశా: కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలని, ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతామని, చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాలను వారితో చర్చిస్తామని, మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం తెలిపారు.
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏటా ఇచ్చే.. అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు శనివారం సాయంత్రం ప్రదానం చేశారు. కేసీఆర్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం జ్ఞాపికను, రూ.5 లక్షల చెక్కును బిగ్బీ అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆయనకు శాలువా కప్పి, ప్రశంసాపత్రాన్ని అందించారు.
కాగా అమితాబ్ నటించిన అభిమాన్ సినిమాను తాను 50 సార్లకు పైగా చూశానని, ఆయన లెజండరీ ఆర్టిస్టు అని, ఆయన పాత్రల్లో జీవిస్తారని, ఆయనకు తన చేతుల మీద అవార్డు ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదని కేసీఆర్ అన్నారు. తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు తరలిరావడంలో కీలక పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వర రావు అని ప్రశంసించారు.
మొన్నమొన్నటిదాకా హైదరాబాద్కి తరలివచ్చిన చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు బాగా స్థిరపడిందని, ముంబై కన్నా ఇక్కడే ఎక్కువ సినిమాలను తెరకెక్కిస్తారని తెలిసిందని, ఇటీవలే రామోజీ ఫిలిం సిటీని చూశానని, ఏడాదికి 200 పైచిలుకు చిత్రాల షూటింగ్ అక్కడ జరుగుతుందని తెలిసిందన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఓ అద్భుతమన్నారు. ఇక తెలుగు సినిమాకు నిఘంటువు అక్కినేని అని వెంకయ్య నాయుడు కొనియాడారు.
నటుడు అనేవాడు తాను కదలకుండా ఎదుటివారి మనసుల్లో కదలికలను పుట్టించాలని, అలాంటి గొప్ప నటులు అక్కినేని నాగేశ్వర రావు, అమితాబ్ అన్నారు. వ్యక్తిత్వం, కర్తృత్వం, మిత్రత్వం కలిసిన నేతృత్వం అక్కినేనిదని, ఆదర్శం, సిద్ధాంతం కన్నా వ్యక్తిత్వం మిన్న అని చాటిన వ్యక్తి అమితాబ్ అన్నారు. అక్కినేని పురస్కారాన్ని అమితాబ్కు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
ఆ తర్వాత పురస్కార స్వీకర్త అమితాబ్ మాట్లాడారు. అక్కినేని అవార్డును అందుకోవడం మహదానందంగా ఉందని, ఆయనతో ఎన్నో అపు రూప క్షణాలను గడిపానన్నారు. ఏఎన్నార్ చాలా నిరాడంబరుడని, సమాజం ఆదరించడం వల్లనే ఈ స్థానంలో ఉన్నామని కాబట్టి సమాజానికి చేతనైనంత సాయాన్ని తిరిగి చేయాలని నమ్మే వ్యక్తి ఆయన అన్నారు. తాను అదే నమ్మానని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ.. అక్కినేని అవార్డు ప్రదానోత్సవాన్ని కొనసాగించాలని మా నాన్నగారు మా దగ్గర మాట తీసుకున్నారని, ఆయన చివరిదశలో దాదాపు 30 రోజులు అమితాబ్ సినిమాలను చూస్తూ గడిపారని, తాను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు అమితాబ్ సినిమాలను చూడమన్నారని, మా అబ్బాయిలు సినిమాల్లోకి వస్తామన్నపుడూ మా నాన్నగారు అమితాబ్ చిత్రాలనే చూడమన్నారని, నాన్నగారు నటించిన చివరి చిత్రం మనంలో అమితాబ్ నటించడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమేనని పేర్కొన్నారు.