మేఘాలయ హోంమంత్రి రాజీనామా... షిల్లాంగ్లో కర్ఫ్యూ... ఆ ఎన్కౌంటర్తో చెలరేగిన హింస
మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో కర్ఫ్యూ విధించారు. నాలుగు జిల్లాల్లో 48గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తిరుగుబాటు సంస్థ అయిన నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(HNLC) మాజీ నేత చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రికి రాసిన రాజీనామా లేఖలో లక్మెన్ రైంబుయ్...'తక్షణం నన్ను హోంశాఖ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.తద్వారా చెరిష్స్టార్ఫీల్డ్ హత్య కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని బావిస్తున్నాను.' అని పేర్కొన్నారు.
థాంగ్కీ మృతదేహానికి ఆదివారం(ఆగస్టు 15) అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
పోలీసులు చెబుతున్న ప్రకారం... గురువారం థాంగ్కీ ఇంటిపై వారు దాడులు చేశారు. ఇటీవల లైతుమ్ఖ్రహ్ ప్రాంతంలో జరిగిన ప్రాంతంలో థాంగ్కీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో థాంగ్కీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే మరిన్ని ఆధారాలు దొరకవచ్చునని భావించారు. ఈ క్రమంలో ఇంటిపై దాడులు నిర్వహించగా... థాంగ్కీ వారిపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు థాంగ్కీపై కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. అతని ఇంట్లో 9ఎంఎం తుపాకీ,కత్తి,ల్యాప్టాప్,మొబైల్ ఫోన్లు,పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్కౌంటర్ అనంతరం థాంగ్కీ ఇద్దరి కుమారులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీజీపీ తెలిపారు. ఇప్పటికైతే వారిని అరెస్ట్ చేయలేదని... అయితే ఇటీవలి పేలుళ్లలో వారి పాత్రపై విచారిస్తున్నామని తెలిపారు.
థాంగ్కీ ఎన్కౌంటర్పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికడంతో.. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మేఘాలయ మానవ హక్కుల కమిషన్ దీన్ని సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.
చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీ హెచ్ఎన్ఎల్సీ వ్యవస్థాపకుల్లో ఒకరు.ఖాసీ-జైంతియా తెగల తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఈ సంస్థ చెప్పుకుంటోంది. మేఘాలయ గడ్డపై పరాయివాళ్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెబుతోంది. జులై 24,2007లో థాంగ్కీ పోలీసులకు లొంగిపోయారు. అప్పటినుంచి 'లో ప్రొఫైల్' మెయింటైన్ చేస్తున్నారు.అయితే ఇటీవలి పేలుళ్లతో ఆయనకు లింకులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు.