కాశ్మీర్ అంశంలో విదేశీ శక్తుల జోక్యమా, దాడిపై చైనా అలాగా.. ఆశ్చర్యం: ముఫ్తీ భగ్గు
జమ్ము కాశ్మీర్లో కల్లోలానికి చైనా ఆజ్యం పోస్తోందని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు.
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో కల్లోలానికి చైనా ఆజ్యం పోస్తోందని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. కాశ్మీర్ను పాకిస్తాన్ అస్థిరపరుస్తోందంటూ ఇప్పటిదాకా ఆరోపణలు గుప్పించిన ముఫ్తీ.. చైనా వైపు వేలు చూపించారు.
చదవండి: చిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపు
యావత్తు దేశం అండగా నిలవకపోతే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పోరులో విజయం సాధించలేమని చెప్పారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఆమె కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్లో పోరు శాంతిభద్రతల సమస్య కాదన్నారు. విదేశీ శక్తుల వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఉగ్రదాడులు, అక్రమ చొరబాట్లు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చైనా కూడా అనవసర జోక్యానికి యత్నిస్తోందని ముఫ్తీ మండిపడ్డారు. ఆ శక్తులన్నీ రాష్ట్రంలో వాతావరణాన్ని పాడుచేస్తున్నాయన్నారు. ఈ పోరులో విజయం సాధించేందుకు సమష్టిగా మద్దతు తెలపాలని దేశ ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను ఆమె కోరారు.
సిక్కిం సరిహద్దుల్లోని డొక్లాంపై భారత్ - చైనా మధ్య సంక్షోభం నెలకొన్న సమయంలో ముఫ్తీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాశ్మీర్ అంశంలో చైనా జోక్యం దురదృష్టకరమన్నారు.
అమర్నాథ్ యాత్రీకులపై దాడిని చైనా ఖండించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని ముఫ్తీ అన్నారు. చైనా ఓ పెద్ద దేశమని, అది దాడిని ఖండించకపోవడం దారుణం అన్నారు.
చదవండి: చైనాకు అజిత్, కాశ్మీర్పై మీ సాయం అవసరం లేదని భారత్ ధీటుగా..
జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా పూర్తి సహకారం అందించడానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్నాథ్తో భేటీ సందర్భంగా అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి, కాశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించినట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370, రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున దానిని నీరుగార్చవద్దని కేంద్రాన్ని కోరానని చెప్పారు.