పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: మోడీకి, బీజేపీకి ముఫ్తీ హెచ్చరిక
శ్రీనగర్: బీజేపీ తమ జోలికి రావొద్దని పీడీపీ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పీడీపీని ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇటీవల జమ్ము కాశ్మీర్లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. అయితే, పలువురు పీడీపీ ప్రజాప్రతినిధులు బీజేపీ వైపు వస్తారని, వారితో త్వరలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముప్తీ హెచ్చరికలు జారీ చేశారు. పీడీపీని చీల్చితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ, పీడీపీల పొత్తు ముగిసిన వెంటనే కూడా ముఫ్తీ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తే కాశ్మీర్ ప్రజలకు భారత ప్రజాస్వామ్యం పైనే నమ్మకం పోతుందన్నారు.
ఇప్పుడు మరోసారి అదే విధమైన హెచ్చరికలు చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పీడీపీ విఫలమయ్యిందని ఆరోపిస్తూ బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ను మూడేళ్ల పాటు పాలించింది.