పోలీసులకు చిక్కిన మెహదీ: ఐఎస్ఐఎస్ ట్విట్టర్పై ఒప్పుకోలు
బెంగళూరు: సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ట్విట్ఠర్ ఖాతాను నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మెహిదీ మస్రూర్ బిశ్వాస్ తమ చేతికి చిక్కినట్లు కర్ణాటక డిజిపి పచావు ధ్రువీకరించారు. పోలీసులు శనివారం తెల్లవారు జామున అతన్ని అదుపులోకి తీసుకున్నారు. @ShamiWitness అనే ఐఎస్ఐఎస్ ఖాతను నిర్వహించినట్లు మెహిదీ అంగీకరించినట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.
ఐఎస్ఐఎస్లో కొత్తగా చేరేవారికి ఆ ట్విట్టర్ ఖాతా నిర్వహణ వల్ల సమాచారం అందించడానికి ఉపయోగపడిందని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆంగ్ల భాష మాట్లాడేవారితో మెహిదీ సంబంధాలు పెట్టుకున్నాడని, వారిని ప్రేరేపిస్తూ వచ్చాడని ఆయన చెప్పారు. మెహిదీ చాలా పోస్టులు అరబిక్ భాష నుంచి అనువాదం అయినవని, కొన్ని ఒరిజినల్ పోస్టులు కూడా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు.

నియామకాలను అతను సులభతరం చేసినట్లు ఏమీ లేదని, విదేశాల్లో కూడా అతను పర్యటనలు చేయలేదని అంటున్నారు. ఇంజనీరింగ్ చదివిన మెహిదీ పశ్చిమ బెంగాల్లో గోపాలపూర్కు చెందినవాడు. బెంగళూరులోని బహుళ జాతి సంస్థలో అతను 2012 నుంచి పనిచేస్తున్నాడు. అతని వార్షిక వేతనం రూ.5.38 లక్షలు. అతని ఉద్యోగం కూడా 2014 మార్చిలో కన్ఫర్మ్ అయింది.
24 ఏళ్ల మెహిదీ నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ను, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. తన అసలు ఉనికిని జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్నాడని, తన విషయం బయటపడదని విశ్వాసంతో ఉన్నాడని డిజిపి అన్నారు. పగలంతా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ రాత్రి వేళల్లో ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని అన్నారు.
అయితే పోలీసుల ఆరోపణల్లో నిజం లేదని మెహిదీ తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడి ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని చెబుతున్నారు. తండ్రి పశ్చిమ బెంగాల్ విద్యుచ్ఛక్తి బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యాడు. మెహిదీ 2012లో అపార్టుమెంటును అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications