యువతి కలలు కల్లలు: బాలీవుడ్ నటిని చేస్తామంటూ రెండేళ్లపాటు గ్యాంగ్రేప్
ముంబై/న్యూఢిల్లీ: సినీ పరిశ్రమలో కథానాయికగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వచ్చిన యువతిపై ఓ దుర్మార్గుడు రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. సినీ పరిశ్రమలో తనకు మంచి పేరుందంటూ ఆమెను లోబర్చుకున్నాడు. మరో వ్యక్తి కూడా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి, మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్కు చెందిన 17 ఏళ్ల శిఖా (పేరు మార్చబడింది) వర్థమాన నటి. బాలీవుడ్లో కథానాయికగా కనిపించాలని ఎన్నో కలలు కంది. ఆమెకు సినిమాల్లో అవకాశమిప్పిస్తానని నమ్మబలికిన ఓ 'పెద్దమనిషి'.. రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ ఘటన జరిగింది.
శిఖా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2014 జూలైలో ఆమె ఘజియాబాద్ యాక్టింగ్ స్కూల్లో చేరింది. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలని, నటిగా రాణించాలని కలలు కంది. స్నేహితుడి ముసుగులో ఓ వ్యక్తి ఆమెకు సునీల్ కులకర్ణిని పరిచయం చేశాడు.
తన సినీ పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి బాధిత మైనర్ బాలికను ట్రాప్ చేశాడు కులకర్ణి. 'అతను మా తల్లిదండ్రులను కలిశాడు. ముంబైలో తనకు చాలా పరిచయాలు ఉన్నాయని, తన వెంట ముంబైకి తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మా తల్లిదండ్రులకు చెప్పాడు. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతని వెంట పంపించేందుకు మా అమ్మనాన్నలు ఒప్పుకున్నారు' అని తెలిపింది.
ఆ తర్వాత అతను తనను ఢిల్లీకి తీసుకొచ్చాడని, ఇక్కడి వసంత్కుంజ్లోని ఓ ఫ్లాట్ తీసుకొని తనను ఉంచాడని తెలిపింది. అక్కడ తనకు ఎప్పుడూ కొన్ని మాత్రలు ఇచ్చేవాడని, వాటని వేసుకుంటే నిద్రొచ్చినట్టు అయ్యేదని చెప్పింది. ఇలా మూడునాలుగు నెలలు గడిచిన తర్వాత ఓ రోజు తనపై బలత్కార యత్నం చేశాడని చెప్పింది. తాను ఆ షాక్లో ఉండగానే కొన్ని ఫొటోలు తీశాడని తెలిపింది.
'ఈ అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు మా తల్లిదండ్రులకు పంపిస్తానని భయపెట్టి.. నాపై అత్యాచారం జరిపాడు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం 2015 ఆగస్టులో తనను ముంబై తీసుకొచ్చాడని, అప్పటి నుంచి గత ఆరు నెలలుగా తనపై అత్యాచారం జరుపుతున్నాడని ఆమె తెలిపింది.
అతనే కాకుండా మరో వ్యక్తితో కూడా తనపై అత్యాచారం చేయించి.. వీడియో తీశాడని, దీని తల్లిదండ్రులకు చెప్తే వీడియోలు బయటపెడతానని హెచ్చరించాడని బాధితురాలు ఢిల్లీ వసంత్ కుంజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని న్యూఢిల్లీ సౌత్ డీసీపీ ఈశ్వర్ సింగ్ తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.