కరోనా కల్లోలం: గ్రామాల్లో ప్రబలుతున్న మూఢ నమ్మకాలు: నైవేద్యంగా నాలుకను కోసుకున్నాడు..!
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోండగా..అంతకంటే ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయి. మారుమూల గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మంత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కరోనా రాదనే దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు కొందరు నెటిజన్లు. తాజాగా- ఈ మూఢ నమ్మకాలు కాస్తా మరింత బలపడినట్టు కనిపిస్తున్నాయి.
నాలుకను నైవేద్యంగా సమర్పిస్తే.. కరోనా నాశనం అవుతుందనే నమ్మాడో యువకుడు. వెంటనే గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశాడు. ఆ వెంటనే తన నాలుకను కోసుకున్నాడు. అపస్మారక స్థితికి వెళ్లిన ఆ యువకుడిని స్థానికులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ఇలంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. దీనితో గ్రామాల్లో భయాందోళనలకు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి వదంతులు, మూఢ నమ్మకాలను విశ్వసించవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆ యువకుడి పేరు వివేక్ శర్మ. మధ్యప్రదేశ్లోని మొరెనాజిల్లాకు చెందిన అతను శిల్ప కళాకారుడు. గుజరాత్లోని బనస్కాంత జిల్లా నాదేశ్వరి గ్రామంలో నివసిస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ను విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో అతను తన స్వస్థలానికి వెళ్లలేదు. అక్కడే ఉంటున్నాడు. శనివారం సాయంత్రం అతను స్థానిక నాదేశ్వరి అమ్మవారి ఆలయంలో అపస్మారక స్థితిలో కనిపించాడు.
Recommended Video
అతణ్ని గుర్తించిన కొందరు భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నాదేశ్వరి అమ్మవారు తనకు కలలో కనిపించిందని, నాలుకను నైవేద్యంగా సమర్పించితే.. కరోనా సోకదని చెప్పిందని అన్నాడు. అందుకే తాను అమ్మవారికి నాలుకను నైవేద్యంగా సమర్పించుకున్నానని చెప్పాడు. ఈ ఘటన అనంతరం బనస్కాంత జిల్లాలోని పలు గ్రామాల్లో భయాందోళనలు అలముకున్నాయి. వదంతులను నమ్మొద్దంటూ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.