లక్కీ లాటరీ: కూలీ కోసం వెళ్లి కరోడ్పతి అయ్యాడు
కోజికోడ్: కూలీ పనుల కోసం సొంత రాష్ట్రాన్ని వదిలి మరో రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం వరించింది. రాష్ట్రం విడిచి వెళ్లిన మూడు రోజులకే కోటి రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతడు కరోపడ్పతి అయిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా లక్ష్మీపూర్కు చెందిన మొఫిజుల్ రహనా షెక్ అనే యువకుడు మార్చి 4వ తేదీన కేరళకు వలస వెళ్లాడు. అదేరోజు అక్కడ 50 రూపాయలు పెట్టి.. 'కారుణ్య' లాటరీ టికెట్ కొన్నాడు.
తర్వాతి రోజు నిర్వహించిన డ్రాలో అతడికి కోటి రూపాయల బంపర్ బహుమతి తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా, తనతో పాటు వచ్చిన వలస కూలీలు తనమీద దాడి చేసి, ఆ లాటరీ టికెట్ ఎక్కడ లాగేసుకుంటారోననే భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి భద్రత కల్పించాలని కోరాడు.
పోలీసులు అతడిని బ్యాంకుకు తీసుకెళ్లి, అక్కడ అకౌంటు ఓపెన్ చేయించి, టికెట్ కూడా అక్కడే సమర్పించారు. దీంతో కోటి రూపాయలలో పన్నులు మినహాయించగా మిగిలిన మొత్తం అతడి ఖాతాలోకి నేరుగా జమ అయిపోతుంది. దీంతో కూలీ పనుల కోసం వెళ్లిన మొఫిజుల్ రహానా షేక్ ఇప్పుడు కరోడ్ పతి అయిపోయాడు.