పాక్తో పొట్టి యుద్ధాలకు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనకు తూట్లు పొడుస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్తో చిన్న చిన్న యుద్ధాలు చేయక తప్పనిసరి పరిస్ధితి ఏర్పడిందని, అందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ హెచ్చరించారు.
1965 ఇండో పాక్ వార్ సందర్భంగా ట్రై సర్వీస్ సెమినార్లో మంగళవారం ఈ విషయాన్నే ఆయిన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో పాక్ సైన్యం కొత్త పద్ధతులతో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పాకిస్ధాన్ ఆలోచనలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని చెప్పిన ఆయన ఈ ఏడాది ఇప్పటి వరకూ 245 సార్లు పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయని అన్నారు. గతంలో భారత సైన్యం ఉన్న శిబిరాలపై కాల్పులు మాత్రమే జరిగేవి, ఇప్పుడు సామాన్యులు లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
భారత సైన్యం ఇకమీదట అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని దల్బీర్ సింగ్ హెచ్చరించారు. భారత సైన్యం పాక్ కాల్పులను సమర్ధంగా తిప్పికొట్టగలదని చెప్పారు. గతవారంలో భారత్, పాక్ల మధ్య చర్చలు విఫలమైన తర్వాత గ్రామాలపై కాల్పులు జరిపి ఇద్దరు మహిళలను బలి గొన్నారని, 22 మందికి తూటాల గాయాలయ్యాయని ఆయన గుర్తు చేశారు.
కేవలం ఆగస్టులోనే పాకిస్థాన్ 55 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంపై ఆయన సైన్యాన్ని హెచ్చరించారు.