రికార్డు ఉష్ణోగ్రతల వేళ వర్షాలు, ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
భానుడు ప్రచండ భానుడిగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించిన విపత్తుల నిర్వహణ శాఖ.. మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భిన్నమైన వాతావరణం వేళ కీలక సూచనలు చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ప్రమాదస్థాయికి చేరినట్టు హెచ్చరించింది. అత్యధికం గా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది. ఈ రోజు (బుధవారం) ఏపీలోని కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

వాతావరణ శాఖ తాజా సూచనలు
అదే విధంగా విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 140 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













Click it and Unblock the Notifications