21 రోజులు లాక్డౌన్.. శవయాత్రలపైనా ఆంక్షలు.. బ్యాంకులు పనిచేస్తాయా? కేంద్రం గైడ్ లైన్స్ ఇవే..
134 కోట్ల మంది ప్రజలు... 21 రోజుల గడువు.. కదిలితే కరోనా వ్యాప్తి.. కాబట్టి కార్యకలాపాలన్నీ బంద్.. ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకే పరిమితమైపోవాలి.. బయటికి రావడానికి వీల్లేదు.. చిన్నాపెద్దా ప్రతిఒక్కరూ ఆంక్షలు పాటించాల్సిందే.. కాదు కూడదంటే అపిడమిక్ డిసీజ్ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లోనైతే అరెస్టులు కూడా తప్పవు.. ఒక్క మాటలో ఇది 'కర్ఫ్యూ'లాంటి వాతావరణం.. ఈ మాట ప్రధాని మోదీ కూడా అన్నారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వచ్చే మూడు వారాలూ చాలా కీలకమని, ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, కలిసికట్టుగా మహమ్మారిపై పోరాడుదామని ప్రధాని పిలుపునిచ్చారు. ఆ మేరకు ఏప్రిల్ 14 వరకు దేశంలో అమలుకానున్న కంప్లీట్ లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏయే సర్వీసులు అందుబాటులో ఉంటాయో, ఏవి ఉండవో, ప్రజలు ఏం చెయ్యాలో, ఏవి చెయ్యొద్దో మొత్తం 13 గైడ్ లైన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఆస్పత్రులు ఓపెన్.. ఆథ్యాత్మిక కేంద్రాలు బంద్..
దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, మెడికల్ షాపులు, మందులు, వైద్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, ఆయా వస్తువుల్ని సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు, క్లినిక్స్, నర్సింహోమ్స్, అంబులెన్సుల సేవలు యధావిధిగా కొనసాగుతాయి. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. కాగా, అన్ని మతాలకు చెందిన ఆథ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా స్థలాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవడానికి వీల్లేదని కేంద్రం హెచ్చరించింది.
బ్యాంకులు, దుకాణాలూ ఓకే..
అత్యవసర సరుకుల తయారీ, రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. అలాగే బ్యాంకులు, ఏటీఎంలు, ఇన్సురెన్స్ ఆఫీసులు యధావిధిగా పనిచేస్తాయి. అయితే, సాధ్యమైనంత తక్కువ మంది స్టాఫ్ తో నడిపించాలని ప్రభుత్వం సూచించింది. పాలు, నిత్యావసర సరుకులు, కూరగాయలతోపాటు చేపలు, మాంసం దుకాణాలు కూడా తెరిచే ఉంటాయని కేంద్రం గైడ్స్ లైన్స్ లో ఉంది. అయితే ఆయా జిల్లాల అధికారులు.. ఈ తరహా సేవల్ని ఇళ్లకే చేరవేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఐటీ సర్వీసులు.. ఫుడ్ డెలివరీ..
దేశంలోని అన్ని వ్యాపార సంస్థలూ 21 రోజుల పాటు మూసివేత పాటించాలని ఆదేశించిన కేంద్రం.. టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులతోపాటు ఐటీ సర్వీసులు కూడా యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఈ కామర్స్ ద్వారా మెడిసిన్, ఫుడ్ డెలివరీ సేవలు కూడా కొనసాగుతాయని పేర్కొంది.
ప్రజా రవాణా పూర్తిగా బంద్..
ఏప్రిల్ 14 వరకు దేశంలోని పరిశ్రమలన్నీ మూతపడతాయని, అత్యవసర వస్తువుల తయారీకి మాత్రమే అనుమతి ఉంటుందని హోం శాఖ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. విమాన, రైలు, రోడ్డు రవాణా పూర్తిగా నిలిచిపోతుందని, నిత్యావసర సరుకుల రవాణా తప్ప మరే ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించబోమని కేంద్రం తెలిపింది. హోటళ్లలో చిక్కుకుపోయిన అతిథులకు సేవలు కొనసాగించుకోవచ్చని, క్వారంటైన్ సెంటర్లపైనా ఆంక్షలు ఉండబోవని చెప్పింది.
అంతిమయాత్రలు ఇలా..
ఈ ఏడాది ఫిబ్రవరి 15, ఆ తర్వాత విదేశాల నుంచి ఇండియాలోకి వచ్చిన వ్యక్తులందరూ విధిగా స్థానిక హెల్త్ కేర్ అధికారులు సంప్రదించాలని, లేకుంటే ఐసీపీ 188 సెక్షన్ ప్రకారం అరెస్టులకు వెనుకాడబోమని కేంద్రం హెచ్చరించింది. అలాగే, వచ్చే 21 రోజులపాటు శవయాత్రలపైనా ఆంక్షలు కొనసాగుతాయని, అంతిమ యాత్రల్లో 20 మందికి మించి జనం హాజరుకావొద్దని కేంద్రం పేర్కొంది.
కేంద్ర సంస్థలు బంద్..
డిఫెన్స్, సెంట్రల్ పోలీస్, ట్రెజరీ, పెట్రోలియం, గ్యాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, పోస్ట్ ఆఫీసులు, సమాచార వ్యవస్థలు, ముందస్తు హెచ్చరికల విభాగాలు మినహా కేంద్రం ప్రభుత్వ పరిధిలోని మిగతా సంస్థలన్నీ ఏప్రిల్ 14 వరకు మూతబడి ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్, హోం గార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసులు, డిజాస్టర్ మేనేజ్ మెట్, జైళ్లు, కలెక్టర్ కార్యాలయాలు, ట్రజరీలు, విద్యుత్, నీటి సరఫరా, శానిటేషన్, మున్సిపాలిటీలు యధావిధిగా పనిచేయాల్సిఉంటుంది. వీలైనంత తక్కువ మంది సిబ్బందితో పనులు కొనసాగించాల్సిఉంటుంది.