బాలుడిపై లైంగిక దాడి.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఇటీవల ఒక మైనర్ బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు చెబుతూ అదనపు సెషన్స్ జడ్జి అను అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిలు కూడా అమ్మాయిల మాదిరిగానే లైంగిక వేధింపులకు గురవుతారని.. అమ్మాయిలపై మాత్రమే దాడులు జరుగుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఈ తీర్పు సామాజిక దృక్పథంలో ఒక కీలక మార్పును సూచిస్తోంది.
పోక్సో చట్టం లింగ వివక్ష చూపదు..
న్యాయమూర్తి తన తీర్పులో పోక్సో చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ఏ ఒక్క లింగానికి మాత్రమే పరిమితం కాదని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలందరినీ, వారు ఏ లింగానికి చెందిన వారైనా, లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందని ఆమె తెలిపారు. ఇది బాలల రక్షణలో చట్టం సమగ్ర స్వభావాన్ని స్పష్టం చేస్తుంది.

దోషికి 15 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ అబ్బాయిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఢిల్లీలోని సాకేత్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో ఆ అబ్బాయిపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. సాకేత్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి (ASJ) అను అగర్వాల్ జులై 31న తన తీర్పులో, అమ్మాయిల మాదిరిగానే అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాధారణంగా అమ్మాయిలపై మాత్రమే లైంగిక దాడులు జరుగుతాయని భావిస్తారని, కానీ అది ఒక భ్రమ అని ఆమె అన్నారు. దోషిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక వేధింపులు), భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 377 (అసహజ నేరాలు) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాత, దోషికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
బాధితుల్లో అబ్బాయిలే ఎక్కువ
ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ అరుణ్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రిపోర్టును కోర్టు ముందుంచారు. ఈ నివేదిక ప్రకారం.. బాలల లైంగిక బాధితుల్లో సుమారు 54.68 శాతం మంది అబ్బాయిలే ఉన్నారు. ఈ గణాంకాలు సమాజంలో నెలకొన్న అపోహలకు భిన్నంగా ఉన్నాయి.
మానసిక వేదన
లైంగిక వేధింపులకు గురైన అబ్బాయిలు కూడా అమ్మాయిల మాదిరిగానే తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తారని కోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనల తర్వాత వారు ఒత్తిడితో బాధపడుతుంటారు. అయితే సామాజిక కట్టుబాట్ల కారణంగా అబ్బాయిలు తమ బాధను బయటపెట్టడనికి సిగ్గుపడతారని, ఇది వారి మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు సమాజంలో ఈ అంశంపై చర్చను ప్రోత్సహిస్తుంది.












Click it and Unblock the Notifications