ఇంటర్ పరీక్షకని వెళ్లి.. జొన్నచేనులో శవమై: విద్యార్థిని మిస్టరీ డెత్?
సిద్దిపేట: పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి బయటకెళ్లిన యువతి శవమై కనిపించడం దుబ్బాక నియోజకవర్గంలో కలకలం రేపింది. మిరుదొడ్డి మండలం రుద్రారంలో శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఎవరా యువతి?
రుద్రారంకు చెందిన ఓ యువతి(18) శుక్రవారం ఉదయం ఇంటర్ పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. పరీక్ష సమయం అయిపోయి సాయంత్రమైనా ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
జొన్న చేనులో మృతదేహం
రాత్రంతా కుమార్తె కోసం ఏడుస్తూ కూర్చున్న కుటుంబ సభ్యులకు.. శనివారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ జొన్న చేనులో ఆమె మృతదేహం పడి ఉన్నట్టు తెలిసింది. హుటాహుటిన అక్కడికెళ్లి చూడగా.. హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేసినట్టుగా గుర్తించారు.
అత్యాచారం జరిగిందా?
యువతిపై అత్యాచారం కూడా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అత్యాచార విషయం బయటపడుతుందనే భయంతోనే ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులుు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
అక్కడే హత్య చేశారా.. లేక?:
జొన్నచేనులో యువతి మృతదేహాన్ని గుర్తించడంతో.. యువతిని అక్కడే హత్య చేశారా? లేక మరెక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చేశారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పరీక్ష తర్వాత పరీక్ష కేంద్రం బయట యువతిని ఎవరైనా కలిశారా? అన్నది తెలిస్తే.. కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు సీసీటీవి ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంది.