విద్యార్థినిపై టీచర్ రేప్, చిత్రహింసలు: ప్రిన్సిపాల్ అరెస్ట్
ఈటానగర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారితప్పి కీచకుడిగా మారాడు. ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టాడు.
అరుణాచల్ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్పై దాడి చేసి టీచర్ను చితకబాదారు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.గాయపడిన టీచర్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్కూల్ ప్రిన్సిపాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడటమే గాక, ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. పాఠశాలకు వెళ్లేందుకు బాధితురాలు విముఖత చూపడంతో ప్రశ్నించిన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిందని చెప్పారు.
విద్యార్థినులపై అరాచకాలకు పాల్పడుతున్న పాఠశాల అనుమతి రద్దు చేయాలని బాధితురాలి బంధువులు, పంగి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ పాఠశాలలోని విద్యార్థులను వేరే పాఠశాలకు మార్పించాలని కోరారు.
బాధితురాలికి రూ. 20లక్షల పరిహారాన్ని స్కూల్ యాజమాన్యం నుంచి ఇప్పించాలని పంగి వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. అరుణాచల్ప్రదేశ్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేసింది. కాగా, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.