మరో దారుణం: అమ్మాయిని సజీవ సమాధి చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా మరో దారుణమైన సంఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ అమ్మాయి ప్రాణాలతో ఉండగానే సమాధి చేశారు. అయితే గమనించిన స్థానికులు ఆమెను సురక్షితంగా బయటికి తీశారు. ఈ ఘటన సీతాపూర్ జిల్లాలోని నెవ్రాజ్పూర్ గ్రామంలో జరిగింది.
బాధిత కిండర్ గార్డెన్ విద్యార్థిని తను చెప్పిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన తనూను ఆమె బంధువులు (అత్తా మామలు) సీతాపూర్లో ఉత్సవాలు జరుగుతున్నాయని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టారు. దీంతో తను అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తను చనిపోయిందని భావించిన నిందిత దంపతులు, ఆమె మృతదేహాన్ని సమీపంలోని పొలంలో సమాధి చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి తనూకు స్పృహ వచ్చింది. ఏదో ఓ రకంగా ఆ అమ్మాయి తన తలను మట్టి నుంచి బయటపెట్టి సాయం కోసం కేకలు వేసింది.
బాధితురాలి కేకలు విన్న సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు ఆమెను రక్షించారు. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.