బాలిక కిడ్నాప్: 75 రోజులు గ్యాంగ్ రేప్
బెల్గాం/బెంగళూరు: మైనర్ ను కిడ్నాప్ చేసి రెండున్నర నెలల పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని బెల్గాంలో జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు కామాంధులను ఖానాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఖానాపూర్ లో మైనర్ బాలిక నివాసం ఉంటున్నది. ఖానాపూర్ లోని నగోడ ప్రాంతంలో నివాసం ఉంటున్నగోపాల్ (27), బలరామ్ నాయక్ (27) అనే ఇద్దరు బాలికను కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ వేశారు.
జూన్ 20వ తేదిన బాలికను కిడ్నాప్ చేసి బెల్గాం తీసుకు వెళ్లారు. తరువాత బెల్గాంలోని అజాం నగర్ లో నివాసం ఉంటున్న రమేష్ చౌగల రూంలో బాలికను నిర్భంధించారు. అప్పటి నుంచి బాలిక మీద గోపాల్, బలరాం నాయక్, రమేష్ సామూహిక అత్యాచారం చేస్తున్నారు.
బాలిక కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేసినా బాలిక ఆచూకి చిక్కలేదు. చివరికి గోపాల్, బలరాం కనపడటం లేదని పోలీసులు గుర్తించారు.
వారిద్దరి మొబైల్ నెంబర్లను ట్రేస్ చేశారు. చివరికి బెల్గాంలో వారిద్దరు ఉంటున్న గది గుర్తించారు. బాలికను రక్షించిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని కామాంధులను అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరిక్షలు చేయించామని, ఈ ముగ్గురు 75 రోజులు ఆమె జీవితంతో చెలగాటం ఆడుకున్నారని పోలీసులు తెలిపారు.