ఫేక్ కిడ్నాప్ తో భర్తకు ఝలక్ ఇచ్చింది
ముంబై: ప్రాఫిట్ లో తనకు వాటా ఇవ్వలేదని విరక్తి చెందిన మహిళ ఫేక్ కిడ్నాప్ నాటకం ఆడి భర్తకు ఝలక్ ఇవ్వడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడింది. తనను తానే కిడ్నాప్ చేసుకుని రూ. 10 లక్షలు డిమాండ్ చేసి ముంబై పోలీసులకు చిక్కిపోయింది.
ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు ఇద్దరూ కలిసి విజయ్ పార్క్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
కోచింగ్ సెంటర్ లో వచ్చే ప్రాఫిట్ నుంచి తన భర్త వాటా ఇవ్వడం లేదని ఆమె (30) విసుగు చెందింది. ఎలాగైనా భర్త నుంచి డబ్బులు వసూలు చెయ్యాలని నిర్ణయించింది. ఆదివారం ఆమె ముందుగా ఇంటికి వెళ్లింది.
తరువాత తనను ఎవరో కిడ్నాప్ చేశారని, వారు నన్ను చిత్రహింసలు పెడుతున్నారని భర్త మొబైల్ నెంబర్ కు వాట్సాప్ లో ఫోటోలు పంపించింది. ఆమె స్పృహకొల్పోయినట్లు ఫోటోలు, వీడియో క్రియేట్ చేసి వాట్సాప్ లో పంపించింది.
కిడ్నాపర్లు రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, వెంటనే నగదు సర్దుబాటు చెయ్యాలని సమాచారం ఇచ్చింది. షాక్ కు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించారు.
చివరికి మీరా రోడ్డు స్టేషన్ సమీపంలో ఆమెను గుర్తించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి విచారించగా ఆమె అసలు విషయం చెప్పడంతో భర్తతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు. భర్తకు, పోలీసులకు హాలీవుడ్ సినిమా చూపించిన ఆమెకు పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చి విడిచి పెట్టారు.