సిఎంలకు రాహుల్ పాఠాలు: కిరణ్ సమైక్యవాదానికి నో?
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ వార్ రూంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గెలుపు పాఠాలు చెప్పారు. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు రాహుల్తో పార్టీ సిఎంల సమావేశం ప్రారంభమైంది. సాయంత్రం మూడున్నర గంటల దాకా ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కిరణ్కు సమైక్యవాదం వినిపించే అవకాశం రాలేదు.
2014 ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా రాహుల్ సిఎంల సమావేశం జరిగింది. భూసేకరణ బిల్లు, లోక్పాల్ బిల్లు, ఆహార భద్రత బిల్లులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని రాహుల్ సూచించారు. యూపిఏ 2 హయాంలో ప్రవేశ పెట్టిన బిల్లులు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏ మేరకు ఉపయోగపడుతాయో చర్చించారు. ప్రధానంగా అవినీతి, ద్రవ్యోల్భణంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అవినీతి నిర్మూలనకు సూచనలు చేశారు. అవినీతిరహిత పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. 2014 కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో పైన ముఖ్యమంత్రుల సలహాలు తీసుకున్నారు.
ఈ భేటీలో రాహుల్, ముఖ్యమంత్రులతో పాటు ఎకె ఆంటోని, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఆహ్మద్ పటేల్, జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్, జనార్ధన్ ద్వివేది, కపిల్ సిబాల్, కెబి థామస్ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్, మిజోరాం, అస్సాం, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయల రాష్ట్రాల సిఎంలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి రాహుల్ నో?
సమావేశంలో రాహుల్ పలు అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగారు. కిరణ్ సమైక్యం గురించి చెప్పేందుకు ఉపక్రమించగా రాహుల్ ఇప్పుడు కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. కిరణ్ విభజన అంశం లేవనెత్తగా దీనిపై ఇద్దరం ప్రత్యేకంగా తర్వాత మాట్లాడుతామని సూచించారట. అయితే ఈ సమస్యను చిన్నగా తీసుకుంటే పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులుండవని కిరణ్ ఉపాధ్యక్షులకు చెప్పారట. రాహుల్తో కిరణ్ ప్రత్యేకంగా సమావేశమై విభజనతో జరిగే నష్టం గురించి వివరించే అవకాశముంది.