మోదీ ‘మిషన్ 2019’: ఎర్రకోట సాక్షిగా రక్షాయజ్ఞం నిర్వహణకు రెడీ.. 60 ఎంపీలకు నో చాన్స్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ జయభేరి మోగించాలని తహతహలాడుతున్న బీజేపీ ఇందుకు పకడ్బందీ ప్రణాళికలు ఇప్పటి నుంచే రచిస్తోంది. కేవలం కేడర్ మీద, సొంత వ్యూహాల మీదే ఆధారపడకుండా భగవత్కత్ క్రుప కోసం కూడా పరితపిస్తోంది. ఇందుకోసం ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టింది. ప్రధాని మోదీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో మార్చి 18 నుంచి 25 దాకా వారం పాటు జరిపే ఈ యజ్ఞానికి పేరు మాత్రం 'రాష్ట్ర రక్షాయజ్ఞం'.
ఎక్కడా రాజకీయ రంగు రాకుండా దేశరక్షణే ధ్యేయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా ఇందులోని రాజకీయ రెపరెపలు అర్థంకాకపోవు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనికి హాజరై ప్రార్థనలు జరుపుతారు. రాష్ట్రపతి కోవింద్ను, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని దీనికి ఆహ్వానించే అవకాశం ఉంది. తొలిరోజున తొలి ఆహుతి మోదీయే ఇస్తారు.

ఎర్రకోట నుంచే ఆగస్టు 15న త్రివర్ణ పతాకావిష్కరణ మరి
యజ్ఞానికి ఎర్రకోటనే ఎంచుకోడానికీ ఓ వ్యూహం ఉంది. భారత్లో గెలిచే పార్టీ నేతే ఎర్రకోట బురుజుల నుంచి స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగరేస్తాడు. అంటే ఇది విజయానికి ప్రతీక. ప్రధాని మోదీ ఇక్కడ నుంచి పతాకాన్ని ఆవిష్కరించడం ఐదోసారి అవుతుంది. మళ్లీ విజయం తమదేనని సంకేతప్రాయంగా చెప్పడానికి ఈ వేదికను ఎంచుకున్నారు. రోజూ 50వేల మంది యజ్ఞానికి హాజరవుతారని, 20వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

60 మంది ఎంపీల పనితీరు దారుణం
మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు క్షేత్రస్థాయి పార్టీ అభివ్రుద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ద్వారా 60కిపైగా సిట్టింగ్ ఎంపీల పనితీరు దారుణంగా ఉందని నిర్ణయించారని పార్టీ వర్గాల కథనం. వీరికి వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ నివేదికల్లో నియోజకవర్గంలో పనితీరు, ప్రజాభిమానం, వ్యతిరేకత, ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

అమిత్ షాకు సమస్యలు ఏకరువు పెడుతున్న ఎంపీలు
ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన సమీక్షలో తేలిన 60మందికి పైగా గల సిట్టింగ్ ఎంపీల జాబితాలో సీనియర్లపాటు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నట్లు బీజేపీలోని విశ్వసనీయ వర్గాల కథనం. ప్రదర్శన సరిగా లేని కారణంగా వచ్చే ఎన్నికల బరిలోనుంచి తప్పించే ఎంపీల జాబితాపై వార్తలు రావటంతో పలువురు ఎంపీలు అమిత్ షా వద్ద బారులు కడుతున్నారు. నియోజకవర్గంలో, బయటా తమ సమస్యలను షాతో ఏకరువు పెడుతున్నారు. ఇలాంటి వారందరికీ అమిత్ ప్రత్యేక సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గ పరిధిలో పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలను హితబోధ చేస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ పథకాల అమలులో విఫలం
మూడున్నరేళ్లుగా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ కొన్ని బాధ్యతలు కట్టబెట్టారు. ఇందులో చాలా మంది ఎంపీలు విఫలం అయ్యారు. శీతాకాల సమావేశాల్లోనూ పలువురు ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను కలిసి నియోజకవర్గాల్లో చేపట్టే పనులకు నిధులు కావాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచిన సమయంలో చాలా మంది ఎంపీలు ఈ బిల్లును ఆమోదించేందుకు విముఖత వ్యక్తం చేశారని.. ముందుగా తమ వేతనాలు పెంచాలని అడిగారని తెలిసింది.

ఈ ఏడాది, 2019 ఎన్నికలపైనే చర్చ
బీజేపీ నేతలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో గురువారం రాత్రి విందు ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల సీనియర్ బీజేపీ నాయకులు ఈ విందులో పాల్గొన్నారు. 2019 సాధారణ ఎన్నికలతో పాటు ఈ లోపు జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్కు ముందు ఇలా బీజేపీ నేతలు సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications